Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • తల్లి పాత్రలో నటిస్తున్న 'ఫిదా' నాయిక
  • మహేశ్ సినిమాలో విద్యార్థుల సమస్యపై చర్చ 
  • నయనతారతో పోల్చద్దంటున్న రకుల్ 
  • చిరంజీవి సినిమాలో దాసరి తనయుడు

*  'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న నాయిక సాయిపల్లవి ప్రస్తుతం ఓ సినిమాలో నాలుగేళ్ల పాపకు తల్లిగా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్న 'కణం' చిత్రంలో సాయిపల్లవి ఇలా తల్లి పాత్రను పోషిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.  
*  దర్శకుడు కొరటాల శివ తన సినిమాలలో సామాజిక సమస్యలను చర్చిస్తాడన్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ హీరోగా ఆయన రూపొందిస్తున్న 'భరత్ అనే నేను' చిత్రంలో కూడా ఓ బర్నింగ్ ప్రాబ్లంను చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. చదువులో ఒత్తిళ్లకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సమస్యను ఇందులో ఆయన తీసుకున్నట్టు, ముఖ్యమంత్రిగా మహేశ్ దానికి ఎటువంటి పరిష్కారం ఆలోచించాడు? అనే అంశాలను చూపిస్తున్నాడట.
*  నయనతారతో తనని పోల్చవద్దని కోరుతోంది అందాల రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల విడుదలైన ఆమె తాజా చిత్రం 'ఖాకి'లో ఆమె పాత్రను ప్రస్తావిస్తూ, మరో నయనతార అవ్వాలనుకుంటున్నారా? అని అడిగితే, ఈ ముద్దుగుమ్మ వెంటనే స్పందించింది. నయనతార చాలా సీనియర్ ఆర్టిస్టు అనీ, తాను ఆమెకు బాగా జూనియర్ నని, ఆమెతో తనను పోల్చడం భావ్యం కాదని పేర్కొంది.    
*  దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ ఆర్టిస్టుగా మళ్లీ పుంజుకుంటున్నాడు. ఇప్పటికే అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న 'ఒక్క క్షణం 'చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అరుణ్, త్వరలో చిరంజీవి నటించే ప్రతిష్ఠాత్మక 'సై రా' చిత్రంలో మరో కీలక పాత్రకు ఎంపికైనట్టు తాజా సమాచారం. 

More Telugu News