miryalaguda: మిర్యాలగూడలో దారుణం... భర్త బాకీ పడ్డాడని భార్యను చెరబట్టిన బడా వ్యాపారి!

  • వ్యాపారంలో గొడవలు రావడంతో విడిపోయిన సత్యప్రసాద్, మోహన్ రావు
  • డబ్బు కోసం సత్యప్రసాద్ ఒత్తిడి
  • ఇవ్వడం లేదని మోహన్ రావు భార్యను నెల రోజుల పాటు బంధించిన వైనం

ఓ వ్యక్తి తనకు రావాల్సిన డబ్బును ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, ఆయన భార్యను నెల రోజుల పాటు చెరబట్టాడో వ్యాపారి. మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నందిగామకు చెందిన సింగిరికొండ మోహన్ రావు, మిర్యాలగూడకు చెందిన కనపర్తి సత్యప్రసాద్ లు కొంత డబ్బు పెట్టుబడి పెట్టి, యూరో బనియన్స్, జిందా తిలిస్మాత్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని వ్యాపారం చేశారు.

తర్వాత గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆపై తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలని మోహన్ రావుపై సత్యప్రసాద్ ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కోర్టు కేసు నిమిత్తం మిర్యాలగూడకు వచ్చిన మోహన్ రావు దంపతులను డబ్బుకోసం సత్యప్రసాద్ గృహనిర్బంధం చేశాడు. మూడు రోజుల తరువాత డబ్బు తేవాలని బెదిరిస్తూ, మోహన్ రావును మాత్రం వదిలి, అతని భార్యను మాత్రం పంపలేదు.

ఆమెను బెదిరించి ఇంటి పనులు చేయించుకున్నాడు. నందిగామ వెళ్లిన మోహన్ రావు, తనకు భార్యతో కలిపి జాయింట్ ఖాతా ఉందని, ఆమె కూడా వస్తేనే డబ్బు తెచ్చే వీలవుతుందని  చెప్పడంతో, ఆమెను తీసుకుని నందిగామ వెళ్లారు. ఎలాగోలా సత్యప్రసాద్ నుంచి తప్పించుకున్న ఆ జంట, నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించగా, తాను ఎవరినీ బంధించలేదని, డబ్బు ఇవ్వకుండా తప్పించుకునేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని సత్యప్రసాద్ వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News