agri gold: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం షెడ్యూల్ ఇది!

  • 32 లక్షల మందిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్
  • రూ. 6 వేల కోట్ల బకాయిలు
  • 29 వరకూ బిడ్డింగ్ దరఖాస్తులు
  • 30 నుంచి డిసెంబర్ 6 వరకూ వేలం

అమాయక ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి, వారిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ కు ఉన్న ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. ఏపీలోని నెల్లూరు, కృష్ణా, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అగ్రిగోల్డ్ కు ఉన్న భవనాలు, భూముల వేలానికి షెడ్యూల్ విడుదలైంది. హైకోర్టు సూచనల మేరకు అధికారులు ఈ షెడ్యూల్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ నెల 29 వరకూ బిడ్డింగ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, ఈ నెల 30 నుంచి డిసెంబర్ 6 వరకూ వేలం ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఆసక్తగలవారు బిడ్డింగ్ లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కాగా, దేశవ్యాప్తంగా 32 లక్షల మంది ఖాతాదారులకు రూ. 6 వేల కోట్లకు పైగా అగ్రిగోల్డ్ చెల్లించాల్సి వుందన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారు, సమీప పోలీసు స్టేషన్లలో సాక్ష్యాలతో కూడిన వివరాలు అందించి, రిజిస్టర్ చేసుకోవాలని గత నెల 12న చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20 లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

More Telugu News