school girl complaint: ఆ స్కూల్ లో తుమ్మితే 200, తమిళం మాట్లాడితే 300, టీసీ కావాలంటే 15,000 జరిమానా కట్టాల్సిందే!

  • తీవ్రమైన శిక్షలు విధిస్తున్న సెట్టిపాళయం ప్రైవేట్ స్కూల్
  • జరిమానా చెల్లించకపోతే స్కూల్ చుట్టూ రౌండ్లు వేయాల్సిందే
  • కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన 9వ తరగతి విద్యార్థిని.. విచారణకు ఆదేశం 

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా సెట్టిపాళయంలోని ప్రైవేటు పాఠశాలలో ఎదురవుతున్న వేధింపులపై విద్యార్థిని లక్ష్మి తన తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఘటన చోటుచేసుకుంది. తమ స్కూల్ పీటీ మాస్టర్ చిన్నచిన్న సమస్యలకు పెద్దపెద్ద శిక్షలు విధిస్తున్నారని ఫిర్యాదులో బాలిక పేర్కొంది. స్కూల్ లో తుమ్మితే 200 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకటి కంటే ఎక్కువసార్లు తుమ్మితే స్కూల్ మైదానం చుట్టూ రౌండ్లు వేయాల్సిందేనని తెలిపింది.

తమిళంలో మాట్లాడితే 300 రూపాయలు చెల్లించాల్సిందేనని తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ సార్లు మాట్లాడితే వారితో మరుగుదొడ్లు క్లీన్ చేయిస్తున్నారని వాపోయింది. జరిమానా కట్టకపోతే స్కూలు గ్రౌండులో పరుగులు తీయిస్తారని, ఒంట్లో బాగుండకపోయినా చేసితీరాలని సదరు బాలిక ఏడుస్తూ చెప్పింది. ఇంటి నుంచి తీసుకొచ్చిన మంచి నీరు తాగొద్దని, స్కూల్ ట్యాంకులోని మురికినీరే తాగాలని టీచర్లు వేధిస్తున్నారని తెలిపింది. ఈ చర్యలతో విసిగిపోయి మరో స్కూల్ లో జాయిన్ అవ్వాలని టీసీ అడిగితే 15,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

More Telugu News