yashwanth sinha: ప్యారడైజ్ పేపర్లలో ఉన్న ప్రతి ఒక్కరిని విచారించండి.. నా కుమారుడిని కూడా: యశ్వంత్ సిన్హా

  • ప్యారడైజ్ పేపర్లలో యశ్వంత్ కుమారుడి పేరు 
  • జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరిని విచారించండి
  • అమిత్ షా కుమారుడిని కూడా

జీఎస్టీపై సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేయడం ద్వారా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా పేరు ప్యారడైజ్ పేపర్లలో వెలుగు చూసింది. నల్లధనానికి స్వర్గధామాలైన దేశాలకు అక్రమ మార్గాల్లో బ్లాక్ మనీని తరలించిన పేర్లతో కూడిన జాబితాను ప్యారడైజ్ పేపర్లు వెలుగులోకి తెచ్చాయి. ఈ జాబితాలో వైసీపీ అధినేత జగన్ పేరు కూడా ఉంది.

ఈ నేపథ్యంలో, యశ్వంత్ సిన్హా స్పందించారు. తన కుమారుడిపై తప్పకుండా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్యారడైజ్ పేపర్లలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో... వారందరినీ విచారించాల్సిందేనని అన్నారు. 15 రోజుల్లోగా వీరందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడితో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జైషాను కూడా విచారించాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక జైషా కంపెనీ ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయంటూ 'ది వైర్' అనే వెబ్ సైట్లో ఇటీవల కథనం వచ్చింది.

More Telugu News