gutta sukhendar reddy: కోమటిరెడ్డి అబద్ధాల పుట్ట.. నేను పార్టీ మార‌ను!: గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి

  • కంచ‌ర్ల భూపాల్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేర‌డంతో గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి అసంతృప్తి
  • పార్టీ మార‌తార‌ని వార్త‌లు
  • జిల్లా అభివృద్ధి కోసమే కృషి చేస్తా
  • ప‌ద‌వుల కోసం పార్టీ మార‌ను-గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి

న‌ల్గొండ‌లో త‌న‌పై సీఎం కేసీఆర్ పోటీచేసినా తానే గెలుస్తాన‌ని, టీఆర్ఎస్ స‌ర్కారు ఆ ప్రాంతానికి ఏమీ చేయ‌లేద‌ని నిన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మాట‌లపై న‌ల్గొండ‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిప‌డ్డారు. న‌ల్గొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కోమటిరెడ్డి వెంకట రెడ్డికి వచ్చిన మెజార్టీ పదివేలు మాత్రమేనని అన్నారు. మ‌రోవైపు సీఎం కేసీఆర్‌పై లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాన‌ని చెప్పుకుంటున్నార‌ని అన్నారు. ఆయ‌న ఓ అబద్ధాల పుట్ట అని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతార‌ని వ్యాఖ్యానించారు. కోమ‌టిరెడ్డి ఇప్పటికైనా ఇటువంటి గొప్ప‌లు చెప్పుకోవ‌డం మానుకోవాలని ఆయ‌న అన్నారు.

కాగా, తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను గుత్తా సుఖేందర్‌రెడ్డి తోసిపుచ్చారు. తాను త‌న‌ జిల్లా అభివృద్ధి కోసమే కృషి చేస్తాన‌ని, ప‌ద‌వుల కోసం పార్టీ మార‌బోన‌ని చెప్పుకొచ్చారు. టీడీపీ నేత కంచర్ల భూపాల్‌రెడ్డి ఇటీవ‌ల‌ టీఆర్ఎస్‌లో చేరిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ మార‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.   

More Telugu News