Telangana: టీకాంగ్రెస్‌కు మరో ఝలక్.. గులాబీ గూటికి అలంపూర్ ఎమ్మెల్యే సంపత్?

  • అసెంబ్లీలో కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తి
  • ప్రస్తుత పరిస్థితులపై కలత 
  • పాలమూరులో హాట్ టాపిక్

తెలంగాణ కాంగ్రెస్‌‌కు మరో ఝలక్. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ‘కారు’ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. గురువారం అసెంబ్లీ లాబీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు, వ్యవహారశైలిపై తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిపారు. ఈ విషయంలో తాను తీవ్ర కలత చెందుతున్నట్టు చెప్పారు. తన వ్యాఖ్యలను వేరేలా అర్థం చేసుకోవద్దని చెప్పారు.

అయితే  ఎమ్మెల్యే వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తోందని పాలమూరు నాయకులు అంటున్నారు. జిల్లాలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణతో విభేదాలు, సొంతపార్టీలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సంపత్ కుమార్ పార్టీని వీడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డితో సంపత్ కుమార్‌కు సంబంధాలు దెబ్బతినడం, కాంగ్రెస్‌లోకి రేవంత్ రావడం.. తదితర అంశాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు.

More Telugu News