Lord Shiva: ఇదేం పూజ!.. శివలింగంపై పాదాలు పెట్టి పూజలు చేసిన స్వామీజీ!

  • ఫొటోలు, వీడియోలు వైరల్
  • వీరశైవ విధానం ప్రకారమే పూజలంటున్న స్వామీజీ శిష్యులు
  • మండిపడుతున్న  శివ భక్తులు

బెంగళూరులో ఓ స్వామీజీ చేసిన పూజ ఇప్పుడు వివాదాస్పదమైంది. శివలింగానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో ఓ స్వామీజీ తన పాదాలను శివలింగంపై పెట్టగా శిష్యులు పూజలు చేశారు. బెంగళూరు శివారులోని రంగనబెట్టలో ఈ ఘటన ఈ నెల 5న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శాంతలింగేశ్వర మఠానికి మరో శాఖను ప్రారంభించిన సందర్భంగా శివలింగానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మఠానికి చెందిన స్వామీజీ ఒకరు తన పాదాలను శివలింగానికి ఆనించగా ఆయన శిష్యులు పూజలు చేశారు. ఈ పూజకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా శైవభక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్పందించిన స్వామీజీ తన శిష్యుల ద్వారా మీడియాకు వివరణ ఇచ్చారు. వీరశైవ విధానం ప్రకారమే పూజలు జరిగాయని తెలిపారు. కాగా, శాంతలింగేశ్వర స్వామీజీ ఏడాదిలో ఒక్క ఉగాది రోజున మాత్రమే మాట్లాడతారు.

More Telugu News