Jaish-e-Mohammad: భారత కు భారీ విజయం... మసూద్ అజర్ మేనల్లుడిని మట్టుబెట్టిన జవాన్లు

  • ఎన్ కౌంటర్ లో హతమైన తల్హా రషీద్
  • మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా
  • వీరమరణం పొందిన రాష్ట్రీయ రైఫిల్స్ జవాను

కాశ్మీరులో ఉగ్రవాదులను పూర్తిగా తుదముట్టించాలన్న లక్ష్యంతో కదులుతున్న భారత సైన్యం మరో కీలక అడుగేసింది. పుల్వామా జిల్లాలో తలదాచుకున్న జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మేనల్లుడు, తల్హా రషీద్ ను జవాన్లు కాల్చి చంపారు. జేఈఎంకు స్థానిక కమాండర్ గా విధులు నిర్వహిస్తూ, యువతను ఉగ్రవాదంవైపు ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలతో రషీద్ పై గతంలోనే కేసులు నమోదయ్యాయి.

ఇక రషీద్ మరో ఇద్దరు ఉగ్రవాదులు ముహమ్మద్ భాయ్, వసీమ్ లతో కలిసి కాండీ అగ్లార్ గ్రామంలో ఉన్నారన్న సమాచారాన్ని అందుకున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఎన్ కౌంటర్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన జవాను వీరమరణం పొందగా, మరో ఇద్దరు పౌరులకూ గాయాలయ్యాయి. ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ తరువాత, ఘటనా స్థలినుంచి ఓ ఏకే 47, ఒక ఎం 16 రైఫిల్, ఓ పిస్టల్, మందుగుండు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News