dhoni: 'ఉంటే ఉంటావు, పోతే పోతావు...' అంటూ ధోనీకి విలువైన సలహా ఇచ్చిన సెహ్వాగ్!

  • న్యూజిలాండ్ తో రెండో టీ-20లో నింపాదిగా ఆడిన ధోనీ
  • విమర్శలు గుప్పించిన నెటిజన్లు, మాజీలు
  • తొలి బంతి నుంచే విరుచుకుపడు
  • ధోనీకి సలహా ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్

ఇటీవలి కాలంలో తన స్థాయికి తగ్గట్టు ఆడటం లేదని, ముఖ్యంగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో నిలదొక్కుకుని కూడా, చేయాల్సిన రన్ రేట్ అధికంగా ఉన్న సమయంలో, నింపాదిగా ఆడుతూ ఉండిపోయిన మహేంద్ర సింగ్ ధోనీపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ రంగంలోకి దిగాడు. ధోనీకి విలువైన సలహా ఇచ్చాడు. వన్డేలతో పోలిస్తే, టీ-20ల్లో పరిస్థితి వేరుగా ఉంటుందని, ఇది ధోనీకి తెలియని విషయమేమీ కాదని చెబుతూనే, మిడిల్ ఆర్డర్ లో వచ్చే ధోనీ, నిలదొక్కుకునేందుకు ప్రయత్నించకుండా, తొలి బాల్ నుంచే పరుగులు చేసేందుకు ప్రయత్నించాలని అన్నాడు.

 ఈ ప్రయత్నంలో అవుట్ అయి పోయినా ఫర్వాలేదని చెప్పాడు. క్రీజులో పాతుకుపోయి పరుగులు చేయకుండా ఉండటంతో పాటు, ఆడిన నాలుగు బంతులనూ బౌండరీలకు పంపితే, టీ-20ల్లో మేలు కలుగుతుందని చెప్పాడు. సాధించాల్సిన పరుగులు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు, ధోనీ వంటి ఆటగాడు, వేగాన్ని పెంచలేకపోతే, ఆ ప్రభావం తరువాత వచ్చే వారిపై పడుతుందని అన్నాడు. కాగా, రెండో టీ-20 మ్యాచ్ తరువాత ధోనీని అనిల్ కుంబ్లే వంటి ఆటగాళ్లు విమర్శించగా, గవాస్కర్ వంటి వారు వెనకేసుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

More Telugu News