doctor: ఈ వైద్యుడు నిజంగా దేవుడే... పురుడు పోసి, బాలింతను ఇలా మోసుకుంటూ ఆసుపత్రికి చేర్చాడు!

  • ఒడిశా జిల్లా మల్కన్ గిరి జిల్లాలో ఘటన
  • రవాణా సదుపాయాలు లేని గ్రామానికి సైకిల్ పై వెళ్లిన డాక్టర్
  • పురుడు తరువాత విషమించిన తల్లి ఆరోగ్యం
  • 10 కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకెళ్లిన డాక్టర్

డబ్బుకు కక్కుర్తి పడుతూ, సంపాదనే ధ్యేయంగా.. లేని రోగాలను అంటగట్టి, వైద్య చికిత్సల పేరిట భారీ ఎత్తున డబ్బు దండుకుంటున్న వైద్యుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న రోజుల్లో 'వైద్యో నారాయణో హరి' అన్న సూక్తిని నిజం చేశాడీ వైద్యుడు. మారుమూల గ్రామానికి వెళ్లి, ఓ గర్భవతికి పురుడు పోయడమే కాకుండా, ఆమెకు వైద్య సేవలు అవసరమైతే, పది కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకుంటూ తీసుకెళ్లాడు.

ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా కూర్మనూరు పంచాయితీ పరిధిలోని మారుమూల గ్రామమైన సారిగెట్టలో ఈ ఘటన జరిగింది. సరైన రవాణా, సమాచార సదుపాయాలు లేని గ్రామంలో సువర్ణ అనే మహిళకు నెలలు నిండి నొప్పులు రాగా, ఓ వ్యక్తి సమాచారంతో, స్థానిక పాత్రికేయుడితో కలసి వైద్యాధికారి ఓంకార్ హోత్తా సైకిల్ పై గ్రామానికి వచ్చాడు. పురుడు తరువాత తల్లీబిడ్డల పరిస్థితి బాగాలేదని గుర్తించి, వారిని తరలించేందుకు వాహనం లేక, ఓ మంచంపై ఇద్దరినీ ఉంచి, 10 కిలోమీటర్ల దూరం ఆమె బంధువులతో కలిసి మోసుకుంటూ తరలించారు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతుండగా, డాక్టర్ చూపిన మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

More Telugu News