warangal: హాస్టల్ బిల్డింగ్ మూడో అంతస్తులోని స్నేహితురాలికి బిర్యానీ ఇద్దామని చున్నీల తాడును వాడితే... ప్రాణం పోయినంత పనైంది!

  • బిర్యానీ కావాలని బాయ్ ఫ్రెండ్ ను కోరిన అమ్మాయి
  • తీసుకెళ్లి చున్నీల తాడుకు కట్టిన యువకుడు
  • కరెంటు తీగలకు తగిలి మంటలు
  • ప్రమాదం జరగకపోవడంతో హెచ్చరించి వదిలేసిన పోలీసులు

తన స్నేహితురాలు రాత్రిపూట బిర్యానీ అడిగింది కదా అని తీసుకుని వెళ్లిన ఓ యువకుడు ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఘటన హన్మకొండలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇక్కడి ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్ లో ఉంటున్న ఓ అమ్మాయి, తన బాయ్ ఫ్రెండ్ ను బిర్యానీ కోరింది. దీంతో ఆగమేఘాల మీద నిన్న రాత్రి 11 గంటల సమయంలో తన స్నేహితుడితో కలసి బిర్యానీ, బిస్కెట్లను తీసుకువచ్చాడు. హాస్టల్ మూడో అంతస్తులో యువతి ఉండటంతో అక్కడికి వెళ్లే వీలు లేక విషయాన్ని ఫోన్ లో చెప్పాడు.

ఆ గదిలోని అమ్మాయిలంతా కలిసి తమ చున్నీలను తాడులా కట్టి కిందకు వదిలారు. ఆ చున్నీల తాడుకు బిర్యానీ పాకెట్ ను యువకుడు కట్టాడు. దీన్ని పైకి లాగుతున్న సమయంలో మధ్యలో ఉన్న రెండు కరెంటు తీగలకు తగులుకుని షార్ట్ సర్క్యూట్ అయింది.

దీంతో ఒక్కసారిగా మంటలు లేచి, పెద్ద శబ్దం వచ్చింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వారంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పారిపోబోతున్న యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, ఎటువంటి ప్రమాదమూ జరగకపోవడంతో అబ్బాయిలను, అమ్మాయిలనూ హెచ్చరించి వదిలేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News