Ashish Nehra: నెహ్రా కుమారుడి బౌలింగ్ యాక్షన్‌కు కోహ్లీ ఫిదా!

  • మైదానంలో బౌలింగ్ యాక్షన్‌కు దిగిన జూనియర్ నెహ్రా
  • ముగ్ధుడైన కోహ్లీ.. జూనియర్ నెహ్రా వచ్చేస్తున్నాడంటూ వ్యాఖ్య
  • మైదానంలో నవ్వులే నవ్వులు

ఫిరోజ్ షా కోట్లా మైదానంలో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన నెహ్రా సొంత మైదానంలో అశేష అభిమానుల మధ్య అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆశిష్ నెహ్రా వీడ్కోలుతో ప్రేక్షకులు, జట్టు సభ్యుల గుండెలు బరువెక్కాయి.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్న వేళ నెహ్రా కుటుంబం మైదానానికి చేరుకుని నెహ్రా చివరి మ్యాచ్‌ను వీక్షించింది. మ్యాచ్ అనంతరం భార్య, పిల్లలతో కలిసి మైదానంలోకి వచ్చిన నెహ్రా ప్రేక్షకులకు అభివాదం తెలిపాడు. ఈ సందర్భంగా నెహ్రా కుమారుడు మైదానంలో బౌలింగ్ యాక్షన్‌కు దిగడాన్ని చూసి అభిమానులు సహా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముగ్ధుడయ్యాడు.

 జూనియర్ నెహ్రా బౌలింగ్ యాక్షన్‌కు ఫిదా అయి ఆశ్చర్యంతో అతడి వైపే చూస్తుండిపోయాడు. టీమిండియాకు మరో నెహ్రా అందుబాటులోకి వస్తున్నాడని చెప్పడంతో నెహ్రా సహా అక్కడున్నవారంతా నవ్వేశారు. ఇప్పుడీ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

More Telugu News