Chandrababu: సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌పై వ‌స్తోన్న వ్యాఖ్య‌ల‌ గురించి తెలుసుకున్న చంద్ర‌బాబు

  • అమ‌రావ‌తిలో టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ భేటీ
  • అసెంబ్లీని వైసీపీ బ‌హిష్క‌రించిన నేప‌థ్యంలో చ‌ర్చ‌
  • సోష‌ల్ మీడియాలో ఏమ‌నుకుంటున్నార‌ని అడిగిన చంద్ర‌బాబు
  • చ‌ది‌వి వినిపించిన మంత్రి కాల్వ శ్రీనివాసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి అధ్యక్ష‌త‌న అమ‌రావ‌తిలో టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ భేటీ కొన‌సాగుతోంది. ఈ భేటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై చంద్ర‌బాబు మంత్రుల‌తో మాట్లాడారు. టీడీపీని ఎదుర్కోలేకే వైసీపీ అసెంబ్లీని బ‌హిష్క‌రించింద‌ని, మ‌రోవైపు ప్ర‌భుత్వ పాల‌న బాగోలేక‌పోవ‌డంతోనే బ‌హిష్క‌రిస్తున్నామ‌ని చెప్పుకుంటోంద‌ని చంద్ర‌బాబు అన్నారు. అసెంబ్లీని బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు తెలిపిన‌ జ‌గ‌న్ తీరుపై ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న గురించి చంద్ర‌బాబు ఆరా తీశారు.

సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వ్యాఖ్య‌ల‌ను చ‌దివి వినిపించాల‌ని మంత్రి కాల్వ శ్రీనివాసులుని చంద్ర‌బాబు కోరారు. అసెంబ్లీని బ‌హిష్క‌రిస్తే ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల‌ను బ‌హిష్క‌రిస్తార‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని కాల్వ శ్రీనివాసులు చంద్ర‌బాబుతో అన్నారు. వైసీపీకి ఓట్లు అడిగే హ‌క్కు లేద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని తెలిపారు. చ‌ట్టస‌భ‌లంటే గౌర‌వం లేని వ్య‌క్తిని తొలిసారి జ‌గ‌న్ రూపంలో చూస్తున్నామ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వారు స‌భ‌కు రావ‌డం లేద‌ని ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని త‌మ సభ్యుల‌కు సూచించారు.

More Telugu News