sania mirza: సానియా, షోయ‌బ్‌ల చిలిపి ట్వీట్లు... ఫిదా అయిన నెటిజ‌న్లు

  • శ్రీలంక‌తో జ‌రిగిన టీ20లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన షోయ‌బ్‌
  • బైక్ బ‌హుమ‌తిగా గెల్చుకున్న పాకిస్థానీ క్రికెట‌ర్‌
  • 'దీని (బైక్‌) మీద వెళ్దాం ప‌దా!...' అంటూ ట్వీట్ చేసిన సానియా
  • 'సిద్ధంగా ఉండు ప్రియా.. వ‌చ్చేస్తున్నా!' అని షోయ‌బ్ ట్వీట్‌... మ‌ధ్య‌లో ట్విస్ట్‌

ట్విట్ట‌ర్‌లో సానియా మీర్జా, షోయ‌బ్ మాలిక్‌ల మ‌ధ్య జరిగిన చిలిపి సంభాష‌ణ నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌ల శ్రీలంక‌తో లాహోర్‌లో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ విజ‌యం సాధించింది. ఆ సిరీస్‌లో షోయ‌బ్ మాలిక్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అందుకుగాను అత‌నికి బైక్ బహుమ‌తిగా ల‌భించింది.

ఆ బైక్ మీద షోయ‌బ్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ... 'దీని మీద వెళ్దాం ప‌దా!' అని ట్వీట్ చేసింది. దీనికి షోయ‌బ్ .. 'సిద్ధంగా ఉండు ప్రియా... వ‌చ్చేస్తున్నా!' అని స‌మాధాన‌మిచ్చాడు. కానీ మ‌రికాసేప‌టికి అదే బైక్‌ను షోయ‌బ్ న‌డుపుతుండ‌గా, మ‌రో క్రికెట‌ర్ షాబాద్ ఖాన్ వెన‌క కూర్చుని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ...'స‌రే అర్థ‌మైంది..ఇప్ప‌టికే ఆ సీటు ఎవ‌రో ఆక్ర‌మించేసిన‌ట్లున్నారు' అని సానియా ట్వీట్ చేసింది.

దీనికి షోయ‌బ్ స్పందిస్తూ...'లేదు లేదు... అత‌న్ని గ్రౌండ్‌కి దూరంగా ఎవ‌రికీ క‌నిపించ‌ని చోట వ‌దిలేశా!' అని ట్వీట్ చేశాడు. మ‌ధ్య‌లో షాబాద్ ఖాన్ కూడా క‌ల‌గ‌జేసుకుని 'సారీ వ‌దినా!' అని ట్వీట్ చేశాడు. ఈ సంభాష‌ణ‌కు పాకిస్థానీ నెటిజ‌న్లు ఫిదా అయిపోయి సానియాను కూడా లాహోర్‌కి ర‌మ్మ‌ని ఆహ్వానిస్తున్నారు.


    

More Telugu News