నల్గొండలో బయటపడ్డ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గీయులు... టీడీపీ ఆఫీస్ ముందు రభస!

  • రేవంత్ ప్లెక్సీలను తగులబెట్టిన మాదగోని వర్గీయులు
  • భూపాల్ రెడ్డి ప్లెక్సీలపైనా ఆగ్రహం
  • అభ్యంతరం తెలిపిన రేవంత్ అభిమానులు
రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న తరువాత, ఆయనపై టీడీపీలోనే కొనసాగుతున్న వారిలోని ఆగ్రహావేశాలు బయటపడ్డాయి. ఈ ఉదయం నల్గొండ టీడీపీ ఆఫీస్ వద్దకు చేరుకున్న టీడీపీ స్థానిక నేత మాదగోని శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు, రేవంత్ రెడ్డి ప్లెక్సీలను దగ్ధం చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ లో చేరుతారని భావిస్తున్న కంచర్ల భూపాల్ రెడ్డి బొమ్మలనూ తగులబెట్టి తమ నిరసనలు తెలిపారు.

కాగా, రెండు రోజుల నాడు రేవంత్ అమరావతి వెళ్లి రాజీనామా చేసిన సమయంలో భూపాల్ రెడ్డి కన్నీరు పెట్టుకోగా, చంద్రబాబు ఓదార్చిన సంగతి తెలిసిందే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డిపై పోటీ చేసిన భూపాల్ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతి విదితమే. కాగా, రేవంత్ అభిమానులుగా ఉన్న టీడీపీ కార్యకర్తలు మాత్రం మాదగోని వర్గీయుల పనికి అభ్యంతరం తెలిపారు.
Go Back to Shorts
nalgonda
revant reddy
Telugudesam

More Telugu News