revant reddy: నాడు ఎన్టీఆర్ కు నాదెండ్ల... నేడు చంద్రబాబుకు రేవంత్..!: ఎల్ రమణ సంచలన వ్యాఖ్యలు

  • టీడీపీకి నయా నాదెండ్లలా తయారైన రేవంత్
  • అధినేత విదేశాల్లో ఉండగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలా?
  • తెలంగాణలో పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారు
  • ఓ ఇంటర్వ్యూలో ఎల్ రమణ ఆరోపణలు

తాము తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా ఉన్న వేళ, ఆనాడు ఎన్టీఆర్ కు నాదెండ్ల వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీకి మరో నాదెండ్లలా తయారయ్యారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ నిప్పులు చెరిగారు. ఈ మధ్యాహ్నం ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న వేళ, ఢిల్లీకి వెళ్లి, రాహుల్ గాంధీతో చర్చలు జరిపి, నమ్మి పదవులిచ్చిన అధినేతకు ఆయన వెన్నుపోటు పొడిచి అభినవ నాదెండ్లగా మారారని దుయ్యబట్టారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని ఆయన చూస్తున్నారని, అది జరిగే పని కాదని అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను అన్యాయంగా కేసీఆర్ ఇరికించారని భావించి, రేవంత్ కు అన్నివిధాలుగా అండగా నిలబడితే, దాన్ని తన స్వార్థానికి వినియోగించుకుని, టీడీపీని బలి ఇవ్వాలని కుట్ర చేశాడని అన్నారు. నాడు నాదెండ్ల, నేడు రేవంత్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఆయన రాజీనామా లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ మొసలి కన్నీరు వంటివని ఎద్దేవా చేశారు. 

More Telugu News