Indian navy: చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా వడివడిగా అడుగులు వేస్తున్న భారత్

  • చైనాకు చెక్ చెప్పేందుకు సిద్ధమైన ఇండియన్ నేవీ
  • శ్రీలంక, పాకిస్థాన్ పేరుతో భారత్ సరిహద్దుల్లోకి చొరబడుతున్న చైనా
  • హిందూ మహాసముద్రాన్ని అధీనంలోకి తీసుకున్న ఇండియన్ నేవీ

హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు భారత్ సమాయత్తమవుతోంది. హిందూ మహా సముద్రంతో చైనాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఓడ రవాణాకు కీలకమైన ఈ ప్రాంతంలో పాగా వేయాలని భావిస్తోంది. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న భారత్ ఆధిపత్యానికి గండికొట్టాలన్న లక్ష్యంతో చైనా పావులు కదుపుతోంది.

ఈ నేపథ్యంలో భారత్ నావికాదళాన్ని ఆధునికీకరించే ఏర్పాట్లలో మునిగినట్టు నావికాదళ సీనియర్లు పేర్కొంటున్నారు. హిందూ మహాసముద్రంలో ప్రతిక్షణం కాపు కాసేందుకు 12 నుంచి 15 డెస్ట్రాయర్లు, భారీ, చిన్నపాటి యుద్ధనౌకలు, గస్తీ నౌకలను ఏర్పాటు చేశారు. అంతేకాక నావల్‌ శాటిలైట్‌ అయిన జీశాట్‌-7తో అంతరిక్షం నుంచి ప్రతిక్షణం గమనిస్తున్నారు.

 మిషన్‌ రెడీ వార్‌ షిప్స్‌ పేరుతో ఇండియన్‌ నేవీ హిందూ మహాసముద్రాన్ని దాదాపు తన అదుపులోకి తీసుకున్నట్లేనని వారు వెల్లడించారు. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి గల్ఫ్‌ ఏడెన్‌, మలాకా జలసంధి వరకూ ఇండియన్ నేవీ 24 గంటల‌ూ గస్తీ కాస్తోందని వారు చెబుతున్నారు.

ఏ చిన్న సహాయం, ఇతర అవసరాలు ఏర్పడ్డా నేవీ వేగంగా స్పందిస్తోందని వారు వెల్లడించారు. మరోవైపు శివాలిక్‌ తరగతికి చెందిన యుద్ధవిమానం బంగాళాఖాతంలో బంగ్లాదేశ్‌, మయన్మార్‌ లవైపు గస్తీ కాస్తోందని వారు తెలిపారు. దానితో పాటు టెగ్‌ తరగతికి చెందిన మరో యుద్ధ విమానం మడగాస్కర్‌, మారిషస్‌ చుట్టూ పహారా కాస్తోందని అన్నారు.

ఐఎన్‌ఎస్‌ త్రిషూల్‌, గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌, కోరో యుద్ధ నౌక అండమాన్‌ సముద్రంలో గస్తీ కాస్తోందని తెలిపారు. ప్రస్తుతం మన దగ్గర 138 యుద్ధనౌకలు ఉన్నాయని చెప్పారు. అలాగే 235 ఎయిర్‌క్రాఫ్ట్‌, హెలికాప్టర్లు ఉన్నాయని వారు వెల్లడించారు. 2027 నాటికి వీటి సంఖ్యను భారీగా పెంచేందుకు నేవీ ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది.

 అప్పటికి యుద్ధ నౌకల సంఖ్యను 212 కు, ఎయిర్ క్రాప్ట్ లు, హెలికాప్టర్ల సంఖ్య 458కి పెంచుకోవాలని ఇండియన్ నేవీ భావిస్తోంది. తద్వారా హిందూ మహా సముద్రం చుట్టూ భారత జలాల్లోకి అవాంఛిత ప్రవేశాన్ని అడ్డుకుని, చైనాకు చెక్ చెప్పవచ్చని నేవీ నిర్ణయానికి వచ్చింది. 

More Telugu News