kadapa: చంపేస్తున్నారు, రమ్మని వేడుకున్న కూతురు... తల్లి వెళ్లే సరికి ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది!

  • ప్రొద్దుటూరు సమీపంలో కలకలం
  • తల్లికి ఫోన్ చేసి రమ్మని వేడుకున్న కూతురు
  • వచ్చేసరికి ఉరికి వేలాడుతూ...
  • కేసు నమోదు చేసిన పోలీసులు

"ఇంట్లో గొడవ జరుగుతోందమ్మా... నన్ను కొడుతున్నారు. నువ్వు త్వరగా రా. లేకుంటే నన్ను చంపేస్తారు..." ఇవి ఓ కుమార్తె తన తల్లితో ఫోన్ లో చెప్పిన చివరి మాటలు. ఆ మాటలు విని ఆందోళనతో ఉరుకులు పరుగుల మీద కూతురి ఇంటికి వచ్చేసరికే, ఆమె అనుమానాస్పద స్థితిలో ఉరి తాడుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం నరసింహాపురంలో కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన మరింత సమాచారం ప్రకారం, చౌడం వెంకటలక్ష్మి (27)కి వెంకటేష్ అనే చేనేత కార్మికుడితో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. గత కొంత కాలంగా నిత్యమూ వెంకటేష్ వేధిస్తున్నట్టు వెంకటలక్ష్మి తన తల్లికి చెబుతోంది. నిన్న ఉదయం తమ్ముడికి ఫోన్ చేసి బాగానే మాట్లాడిన వెంకటలక్ష్మి, ఆపై కాసేపటికే తల్లికి ఫోన్ చేసి, తనను కొడుతున్నారని చెప్పి, చంపేస్తారేమోనని భయంగా వుందని చెప్పింది. వెంటనే ఆమె తల్లి నరసింహాపురం వెళ్లేసరికి, అత్త, భర్త ఇంట్లో లేకపోగా, కుమార్తె ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమె ఇచ్చిన సమాచారంతో స్థానికులు, పోలీసులు వచ్చారు. తన కుమార్తెను హత్య చేశారని ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News