andhrapradesh: నవ్యాంధ్ర అసెంబ్లీ, హైకోర్టులకు నూతన డిజైన్లు.. కోహినూర్ ఆకారానికి స్వస్తి!

  • లండన్‌లో రాజమౌళితో కలిసి డిజైన్లను సందర్శించిన చంద్రబాబు
  • దేశానికి తలమానికంగా ఉండేలా  రూపొందించామన్న ఫోస్టర్ ప్రతినిధులు
  • అడుగడుగునా సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపకల్పన

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాల కోసం నూతన డిజైన్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, అధికారులు, టాలీవుడ్ దర్శకుడు రాజమౌళితో కలిసి మంగళవారం లండన్‌లో వీటిని పరిశీలించారు. గతంలో రూపొందించిన డిజైన్లపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కొత్తగా వీటిని రూపొందించారు.

ఒక్క ఏపీకే కాకుండా దేశం మొత్తం గర్వపడేలా, భారతీయత ఉట్టిపడేలా అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు రూపకల్పన చేసినట్టు నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు క్రిస్ బాబ్, పిడ్రో వివరించారు. రాష్ట్ర ఘన చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్క్‌షాపులో అసెంబ్లీ, హైకోర్టులు ఒక్కోదాని కోసం రెండేసి డిజైన్లు ప్రదర్శించారు.
 
 గతంలో కోహినూర్ ఆకృతిలో అసెంబ్లీని, బౌద్ధ స్థూపం ఆకృతిలో హైకోర్టు డిజైన్లను రూపొందించారు. అయితే  కోహినూర్ ఆకృతిని ఇప్పుడు పక్కనపెట్టేశారు. అలాగే హైకోర్టు కోసం సిద్ధం చేసిన బౌద్ధ స్థూపాకారం డిజైన్ చెన్నైలో నిర్మించిన టెంపుల్ టవర్‌ను పోలి ఉండడంతో దానినీ పూర్తిగా పక్కనపెట్టేసి కొత్త వాటిని డిజైన్ చేశారు.  అలాగే ఈ రెండు భవనాలతో కూడిన అమరావతి నగరం ఎలా ఉండబోతోందన్న దానిని కళ్లకు కట్టేలా త్రీడీ గ్రాఫిక్స్ ఉపయోగించి రూపొందించిన వీడియోను ప్రదర్శించారు.

More Telugu News