Reliance: ఈ దీపావళికి అందరూ ఇస్తున్న 'మొబైల్ ఫోన్' కానుక ఏంటో తెలుసా?

  • గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ‘జియో’ ఎంచుకుంటున్న యువత
  • ఈ ఏడాది గణనీయంగా పెరిగిన ఫీచర్ ఫోన్ల అమ్మకాలు
  • మొత్తం మార్కెట్ వాటాలో 52 శాతం వీటిదే

జియో 4జీ ఫీచర్ ఫోన్.. టెలికం రంగంలో ఇప్పుడిదో సంచలనం. కేవలం రూ.1500కే అందుబాటులోకి వస్తున్న ఈ 4జీ ఫీచర్ ఫోన్ ఇప్పుడు మరో రూపు సంతరించుకుంది. ఈ దీపావళికి మిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు బహుమానంగా చాలామంది ఈ ఫోన్‌నే ఇస్తున్నట్టు వెల్లడైంది. దీపావళికి ఇస్తున్న బహుమానాల్లో ఇదే ముందున్నట్టు తేలింది.

ఈ ఏడాది మొత్తం మార్కెట్లో ఫీచర్ ఫోన్లు 52 శాతాన్ని ఆక్రమించుకున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జియో ఫీచర్ ఫోన్ రాకతో నోకియా, ఐటెల్ కూడా ఈ బేసిక్ ఫోన్ సెగ్మెంట్‌పై దృష్టి సారించాయి. టైర్-2, టైర్-3 నగరాల్లో బుక్ అవుతున్న ఫీచర్ ఫోన్లలో దాదాపు 90 శాతం బహుమానంగా ఇచ్చేందుకేనని ‘వైడర్ డాట్ ఇన్’  వ్యవస్థాపకుడు దేవేష్ రాయ్ తెలిపారు.

వైడర్ డాట్ ఇన్ ఓ ఆన్‌లైన్ హోల్‌సేల్ యాప్. ఐ-కాల్, ఇన్‌ఫోకస్, సలోరా బ్లాక్‌జోన్, రాక్‌టెల్, కార తదితర బ్రాండల ఫోన్లు, ఫ్యాషన్ ఉత్పత్తులు, హోం ఫర్నిషింగ్, ఎలక్ట్రానిక్స్  వస్తువులను విక్రయిస్తుంటుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫీచర్ ఫోన్ల విక్రయం ఆగస్టు నెలలో 20 శాతం పెరిగింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో 52 శాతం పెరిగినట్టు ఇంటర్నల్ డేటా సైన్స్ బృందం జరిపిన సర్వేలో తేలింది. అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ప్రకటించిన  బై బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ, రాయితీల కారణంగా దీపావళికి అమ్మకాలు పెరిగినట్టు పేర్కొంది.

More Telugu News