harshita dahiya: గాయని హర్షితను ఢిల్లీ శివార్లలో కాల్చి చంపిన దుండగులు

  • రాగిణి సాంగ్స్ ద్వారా ఫేమస్ అయిన హర్షిత దహియా
  • కారులో వెళుతుంటే అడ్డుకున్న హంతకులు
  • తలలో గొంతులో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు
  • అక్కడికక్కడే మృతిచెందిన యువ గాయని

తన అల్బమ్స్ తో యూత్ లో ఎంతో పేరు తెచ్చుకున్న హర్యానా గాయని హర్షితా దహియా (22)ను ఢిల్లీలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు. దహియా తలలో, గొంతులో ఆరు బుల్లెట్లను దించడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ పరిధిలోని నారెల్లాలో ఓ ప్రదర్శన ఇచ్చిన ఆమె, తిరిగి తన ప్రాంతమైన పానిపట్ కు వెళుతుంటే ఈ ఘటన జరిగింది. ఆమె కారును ఓవర్ టేక్ చేసిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

కారును ఆపిన తరువాత, అందులో ఉన్న ఇద్దరిని వెంటనే కారు దిగాలని వారు హెచ్చరించారని, ఆపై అత్యంత సమీపం నుంచి పలు రౌండ్లు కాల్పులు జరుపగా, ఆరు బుల్లెట్లు ఆమెను తాకాయని చామరా సీనియర్ పోలీస్ ఆఫీసర్ దేష్ రాజ్ తెలిపారు. ఆ వెంటనే హంతకులు పారిపోయారని అన్నారు.

కాగా, తనకు బెదిరింపులు వస్తున్నాయని, చంపుతామని అంటున్నారని ఇటీవల హర్షిత తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు, వీడియోలు పెట్టడం గమనార్హం. 'రాగిణి' సాంగ్స్ పాడుతూ, ఈమె చేసే నృత్యాలు హర్యానాలో ఎంతో ఫేమస్. హర్షిత హత్యపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News