subrahmanya swamy: వచ్చే దీపావళికల్లా అయోధ్య రామ మందిరం సిద్ధం: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

  • డిసెంబర్ 5 నుంచి సుప్రీంకోర్టులో తుది విచారణ
  • సాధారణ హక్కుల కంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత
  • రామ జన్మభూమిలో పూజలు చేసుకోవడం ప్రాథమిక హక్కు అని నేను వాదించా

రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంపై తుది విచారణ డిసెంబర్ 5వ తేదీ నుంచి సుప్రీంకోర్టులో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రామ మందిర నిర్మాణ పనులు వచ్చే ఏడాది ఆగస్టులో ప్రారంభమై, దీపావళి నాటికి ముగుస్తాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది దీపావళికల్లా మందిరం సిద్ధమవుతుందని చెప్పారు.

రామ జన్మభూమి ప్రాపర్టీ తమదేనంటూ ముస్లిం పార్టీలు చేసిన వాదనను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన సంగతిని స్వామి గుర్తు చేశారు. రామ జన్మభూమిలో పూజలు చేసుకోవడం తమ ప్రాథమిక హక్కని తాను వాదించానని చెప్పారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం సాధారణ హక్కులపై ప్రాథమిక హక్కులదే పైచేయి అవుతుందని అన్నారు. ఈ కారణం చేత ఇకపై కేసు నిలవబోదని... మనమే గెలవబోతున్నామని స్వామి చెప్పారు.

More Telugu News