gurmeet: గుర్మీత్ ను చూపించాలని మారాం... జైల్లో హనీప్రీత్ తొలిరాత్రి గడిచిందిలా!

  • నిద్రలేని రాత్రి గడిపిన హనీప్రీత్ సింగ్
  • డిన్నర్ కూడా చేయలేదట
  • గుర్మీత్ ను చూపించాలని వేడుకున్న హనీప్రీత్
  • వెల్లడించిన జైలు అధికారులు

అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రికగా చెప్పుకునే ప్రియాంకా తనేజా అలియాస్ హనీప్రీత్ సింగ్, అంబాలాలోని కేంద్ర కర్మాగారంలో తొలిరాత్రిని నిద్రలేకుండా గడిపినట్టు తెలిసింది. పంచకుల కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిమాండ్ ముగిసిన అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

ఇక జైల్లో తొలిరోజు ఆమె రాత్రి భోజనం స్వీకరించలేదని, ఆమెతో పాటు పట్టుబడిన సుఖ్ దీప్ కౌర్ కూడా అదే బ్యారక్ లో ఉండగా, వీరిద్దరికీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. అంబాలా ప్రాంతంలో డేరా మద్దతుదారులు వేలాదిగా ఉండటం, జైల్లోనూ వారికి అనుకూల వర్గాలు ఉండటంతో నిఘా పెంచామని అన్నారు. ఇతర మహిళా ఖైదీలతో వారిని కలిపి ఉంచలేదని అన్నారు.

జైలుకు తీసుకురాగానే, ఒక్కసారి తనకు గుర్మీత్ ను చూపించాలని ఆమ  వేడుకుందని అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల సమయంలో తనకు ఆరోగ్యం బాగాలేదని, బీపీ పెరిగిందని ఆమె చెప్పినట్టు వెల్లడించారు. అంబాలా సివిల్ హాస్పిటల్ నుంచి వచ్చిన ముగ్గురు డాక్టర్లు రెండు గంటల పాటు హనీప్రీత్ ను పరిశీలించారని అన్నారు. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఒత్తిడి వల్లే రక్తపోటు పెరిగిందని డాక్టర్లు చెప్పారని జైలు అధికారి ఒకరు తెలిపారు. నిబంధనల మేరకు ఉదయం 6 గంటలకే వారిని లేపామని, ఆపై స్నానం చేసిన తరువాత టీ, రెండు బ్రెడ్ ముక్కలు ఇచ్చామని వెల్లడించారు.

More Telugu News