panjab: పంజాబ్ లో బీజేపీకి చుక్కెదురు... గురుదాస్ పూర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ!

  • లక్ష ఓట్ల మెజారిటీ దిశగా కాంగ్రెస్ అభ్యర్థి
  • నటుడు వినోద్ ఖన్నా మరణంతో ఉప ఎన్నిక
  • గెలుపు ఖరారు చేసుకున్న సునీల్ జాఖర్

ఆరు నెలల క్రితం పంజాబ్ లో సంకీర్ణ అధికారానికి దూరమైన బీజేపీకి తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆరు నెలల నాడు గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఉంటుందని ఆశించిన బీజేపీ నేతలకు భంగపాటు కలిగిస్తూ, ప్రజలు తాము కాంగ్రెస్ వెంటే ఉన్నామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా, కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ భారీ మెజారిటీతో విజయం దిశగా దూసుకెళుతున్నారు.

 ఇప్పటికే విజయం ఖరారు చేసుకున్న ఆయన, తన సమీప బీజేపీ అభ్యర్థి స్వర్ణ్ సాలారియా కన్నా, ప్రస్తుతం 94,161 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ తరఫున మేజర్ జనరల్ సురేష్ ఖజారియాకు కూడా చెప్పుకోతగ్గ ఓట్లు లభించాయి. సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ప్రజలు తమవైపే ఉన్నారని, కేంద్రంలోని బీజేపీ పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరన్నదానికి ఈ ఫలితాలు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.

More Telugu News