love: కృష్ణా జిల్లాలో ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు!

  • ఏపీలోని స్పిన్నింగ్ మిల్లులో ప్రేమలో పడ్డ ఒడియా జంట
  • పెద్దల చర్చల్లో భేదాభిప్రాయాలు రావడంతో సందిగ్ధంలో పడ్డ వివాహం
  • ప్రియుడితో మాట్లాడడం మానేసిన ప్రియురాలు
  • ఆగ్రహంతో కత్తితో దాడి చేసిన ప్రియుడు

కుటుంబాల మధ్య వచ్చిన భేదాభిప్రాయాలతో ప్రియురాలు మాట్లాడటం మానేసిందన్న ఆగ్రహంతో ఆమెపై ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలోని స్పిన్నింగ్‌ మిల్లులో ఒడిశా రాష్ట్రంలోని భద్రాక్‌ జిల్లా బగానా గ్రామానికి చెందిన కమలకాంత్‌ నాయక్‌ (23), అదే జిల్లాలోని సుందర్‌ పూర్‌ గ్రామానికి చెందిన రింకీరాణి (20) రెండేళ్లుగా పనిచేస్తూ, కంపెనీ క్వార్టర్స్‌ లో నివాసం ఉంటున్నారు.

ఒకే జిల్లా, ఒకే కులానికి చెందిన వారు కావడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం రింకీరాణి స్వగ్రామానికి వెళ్లగా, కమల కాంత్‌ నాయక్‌ సూచనల మేరకు అతని కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి వారి వివాహానికి సంబంధించిన చర్చలు జరిపారు.

 ఈ చర్చల్లో భేదాభిప్రాయాలు రావడంతో వివాహం సందిగ్ధంలో పడింది. దీంతో రెండు రోజుల క్రితం రింకీరాణి తిరిగి విధులకు వచ్చింది. అయితే ఇంటి నుంచి వచ్చిన తరువాత ఆమె కమలకాంత్‌ నాయక్‌ ను పట్టించుకోవడం మానేసింది. దీంతో ఆమెను కలిసేందుకు రాత్రి 10 గంటల సమయంలో క్వార్టర్స్‌ లోని ఆమె గదికి వెళ్లాడు. అయితే ఆమె అతనితో మాట్లాడేందుకు నిరాకరించింది.

దీంతో ఆగ్రహానికి గురైన కమలకాంత్ తన వెంటతెచ్చిన కత్తితో ఆమె మెడ, నడుం భాగాల్లో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను స్నేహితురాళ్లు హుటాహుటీన చిన్నఅవుటపల్లిలోని పిన్నమేనని సిద్ధార్థ హాస్పిటల్ కు తరలించారు. దీనిపై ఫిర్యాదు నందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న కమలకాంత్ నాయక్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. 

More Telugu News