Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అభద్రతా భావం లేదంటున్న అనుపమ 
  • కొత్త ప్రాజక్టుల గురించి శ్రుతిహాసన్ 
  • 'కాలా' షూటింగ్ పూర్తి చేసిన రజని 
  • జనవరి నుంచి నాని కొత్త సినిమాలు 

*  'నేను చేస్తున్న సినిమాలలో ఇద్దరు హీరోయిన్లు వున్నా, ముగ్గురు హీరోయిన్లు వున్నా నాకేమీ అభద్రతా భావం లేదు..' అంటోంది మల్లూ బేబీ అనుపమా పరమేశ్వరన్. 'నా దృష్టిలో ఏ సినిమాకైనా కథే హీరో. ఆ కథలను బట్టే పాత్రలుంటాయి. అందుకని నేను ఎంతమంది హీరోయిన్లు వున్నారన్నది పట్టించుకోను. నేను చేసే పాత్రలపై నా ముద్ర మాత్రం వుంటుంది' అంటూ చెప్పుకొచ్చింది అనుపమ.
*  అందాల శ్రుతిహాసన్ 'కాటమరాయుడు' సినిమా తర్వాత మళ్లీ కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు. ఇదే విషయాన్ని ఈ ముద్దుగుమ్మ వద్ద ప్రస్తావిస్తే, 'మా డాడీతో కలసి చేస్తున్న శభాష్ నాయుడు చిత్రం షూటింగ్ దశలో వుంది. అలాగే మరోపక్క హిందీ సినిమా 'యారా' కూడా నిర్మాణంలోనే వుంది. ఈ రెండూ అయ్యేవరకు మరో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాను. అంతేతప్ప, ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు' అని చెప్పింది.
*  పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కాలా' సినిమాలో రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న సంగతి విదితమే. ఇందులో రజనీ తన షూటింగు పార్టును పూర్తి చేసినట్టు సమాచారం. ఈ నెలాఖరుకి మొత్తం షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు.
*  ప్రస్తుతం 'ఎంసిఏ', 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాలలో నటిస్తున్న నేచురల్ స్టార్ నాని జనవరి నుంచి కొత్త సినిమాలు చేస్తాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని, విక్రంకుమార్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేస్తాడట.   

More Telugu News