ys jagan: జగన్ ను శశికళ, గాలి కూడా ఫాలో అవుతారేమో: కంభంపాటి

  • 12 కేసుల్లో ఏ1 ముద్దాయైన వ్యక్తి యువతకు ఏం సందేశమిస్తారు
  • అక్రమ సంపాదనను ప్రజలకు పంచి, పాదయాత్ర చేపట్టాలి
  • వైసీపీ ఎంపీలు ఎప్పుడు రాజీనామా చేస్తారు?

తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూడబెట్టిన అక్రమాస్తులన్నింటినీ ప్రజలకు అప్పగించిన తర్వాతే వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను చేపట్టాలని టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ స్ఫూర్తితో తమిళనాడులో శశికళ, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డిలు కూడా పాదయాత్రలు చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారంటూ గతంలో జగన్ ప్రకటించారని... వైసీపీ ఎంపీలు ఇంకెప్పుడు రాజీనామా చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని యువత ముఖ్యమంత్రి చంద్రబాబులాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 12 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి యువతకు ఎలాంటి సందేశం ఇవ్వగలడని అన్నారు. ప్రత్యేకహోదా అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని... ఈ నేపథ్యంలో ఎక్కువ నిధులను రాబట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. 

More Telugu News