తెలంగాణ: నా కళ్లముందే ప్రణబ్ముఖర్జీ సంతకం చేసి.. నా జన్మ ధన్యమయిందని ఆశీర్వదించారు: కేసీఆర్
- సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేసీఆర్
- మన ప్రజల ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం తెలంగాణ సాధించుకున్నాం
- ఆ రోజు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయి రాష్ట్రపతి వద్దకు వెళ్లింది
- అప్పుడు అక్కడే ఉన్నాను
మన ప్రజల ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం తెలంగాణ సాధించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... ఆ రోజు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ వద్దకు వెళ్లిందని, తన కళ్లముందే ప్రణబ్ ముఖర్జీ ఆ ఫైలుపై సంతకం చేసి, తన జన్మ ధన్యమయిందని ఆశీర్వదించి, తనను ప్రశంసించారని చెప్పారు.
తనకు జన్మనిచ్చింది సిద్దిపేటేనని, తెలంగాణకు సిద్దిపేట జిల్లా గుండెకాయ వంటిదని కేసీఆర్ అన్నారు. తన జన్మభూమి సిద్దిపేటకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని అన్నారు. సిద్దిపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో ఎరువుల కొరతలేదని అన్నారు. రైతులు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాను కూడా రైతునేనని రైతుల కష్టాలు తనకు తెలుసని అన్నారు. తాము కోతలు లేకుండా 24 గంటలు విద్యుత్తు అందిస్తున్నామని చెప్పారు. తనకు బలమిచ్చింది, పోరాటాన్ని నేర్పింది సిద్దిపేటనేనని అన్నారు.