raghuveera reddy: 'పుర' ప్రాజెక్టును పూర్తి చేయండి... చంద్రబాబుకు బహిరంగలేఖ రాసిన రఘువీరా!

  • ఓ సదుద్దేశంతో 'పుర' ప్రాజెక్టును ప్రారంభించాం
  • ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం తగదు
  • పనులు చేపట్టకపోతే భారీ ఉద్యమం తప్పదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బహిరంగలేఖ రాశారు. 2013లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన 'పుర' ప్రాజెక్టును పూర్తి చేయాలని లేఖలో కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి సౌకర్యాలను కల్పించే సదుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా రూ. 187 కోట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పారు.

 కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ కు పేరొస్తుందని, నాయకులకు కమిషన్లు రావనే ఉద్దేశంతో బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పనులపై ప్రభుత్వ అలసత్వాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగానే తాము ఈ డిమాండ్ చేస్తున్నామని... అవసరమైతే 'పుర' అనే పేరు బదులు 'చంద్రబాబు పథకం' అంటూ పేరు మార్చుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు. నెల రోజుల్లో పనులను ప్రారంభించి, మూడు నెలల్లోగా పూర్తి చేయాలని... లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవనెత్తుతామని అన్నారు.

More Telugu News