uttarpradesh: గోరఖ్ పూర్ లో మరోసారి మృత్యుఘోష.. 16 మంది చిన్నారుల మృతి

  • గత ఆగస్టులో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో 63 మంది చిన్నారుల మృతి
  • మెదడు వాపు వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు 
  • గడిచిన 24 గంటల్లో 16 మంది చిన్నారుల మృతి

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ నిన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన నియోజక వర్గం గోరఖ్ పూర్ లోని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చిన్నారుల మృత్యుఘోష ఆగడంలేదు. గత ఆగష్టులో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఈ ఆసుపత్రిలో 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

అదే ఆసుపత్రిలో గత 24 గంటల్లో 16 మంది చిన్నారులు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. వీరిలో 10 మంది చిన్నారులు నియోనాటల్ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ లో చికిత్స పొందుతూ మరణించగా, మరో ఆరుగురు పీడియాట్రిక్‌ ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మెదడువాపు వ్యాధితో బాధపడ్డారని వైద్యులు తెలిపారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఈ ఆసుపత్రిలో 310 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 

More Telugu News