cheap liquor: ఇక తాము 'చీప్' కాదంటున్న అమరావతి మందుబాబులు!

  • భారీగా తగ్గిన చీప్ లిక్కర్ అమ్మకాలు
  • రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరగడమే కారణం
  • ప్రతి ఒక్కరి చేతుల్లో డబ్బుండటంతో ప్రీమియం బ్రాండ్లకు గిరాకీ

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో పెరిగిన భూముల ధరలు ప్రజల జీవన సరళిని ఒక్కసారిగా మార్చివేశాయి. ఈ ప్రాంతంలోని 14 మండలాల్లో నగర వాతావరణం సంతరించుకోగా, ఇంతకాలమూ చీప్ లిక్కర్ తాగుతూ వచ్చిన మందుబాబులు, ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ డబ్బు కేటాయించి మీడియం లేదా ప్రీమియం బ్రాండ్ల వైపు వెళ్లిపోతున్నారు. అమరావతి ప్రాంతంలో చీప్ లిక్కర్ అమ్మకాలు తగ్గిపోయి, మీడియం, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు ఎక్సైజ్ శాఖ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

చౌక మద్యం అమ్మకాల్లో వృద్ధి కనిపించడం లేదని, దీంతో లిక్కర్ కంపెనీలు సైతం చౌక మద్యం తయారీని తగ్గించేశాయని అధికారులు అంటున్నారు. కేసు మద్యం ధర రూ. 400 కన్నా తక్కువగా ఉంటే దానిని చీప్ లిక్కర్ గా పరిగణిస్తారు. ఈ కేటగిరీ కూడా అన్ని వైన్స్ షాపుల్లో ఉండటం తప్పనిసరి. ఈ బ్రాండ్లలో 180 ఎంఎల్ బాటిల్ ధర రూ. 50 నుంచి మొదలవుతుంది. డిస్టిలరీలు, ప్రభుత్వంతో కుదిరే ఒప్పందం మేరకు చీప్ బ్రాండ్లు కూడా వైన్స్ షాపుల్లో అందుబాటులో ఉంచాలి. అందువల్ల ప్రజలు ఆసక్తి చూపకున్నా నామమాత్రంగానైనా చౌక మద్యం బాటిళ్లను అందుబాటులో ఉంచుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

ఇక ఈ సంవత్సరం మొదట్లో అమరావతి ప్రాంతంలో నెలకు 5.5 లక్షల కేసుల చౌక మద్యం విక్రయించబడగా, జూన్ నాటికి 4.5 లక్షల కేసులకు తగ్గింది. సెప్టెంబర్ నాటికి అమ్మకాలు 4 లక్షల కేసులకన్నా తక్కువకు పడిపోయాయి. ఇదే సమయంలో మీడియం, ప్రీమియం, హైఎండ్ మద్యం బ్రాండ్ల అమ్మకాలు పెరిగాయి. రాజధాని ప్రాంతంలో భారీగా ధనం చేతులు మారుతుండటంతోనే ఆ ప్రభావం చీప్ లిక్కర్ పై పడిందని అధికారులు చెబుతున్నారు.

More Telugu News