gautami: సహజీవనం చేసినంత మాత్రాన కమల్ కు మద్దతివ్వాలని లేదు: నటి గౌతమి

  • ప్రజల పక్షాన నిలిస్తేనే మద్దతు
  • రాజకీయాల కోరిక లేదు
  • అమ్మ మరణం వెనుక నిజాలు బయటకు రావాలి
  • పారదర్శకంగా విచారణ జరపాలని గౌతమి వినతి

కమలహాసన్ రాజకీయాల్లోకి వస్తే, తాను మద్దతివ్వాలని రూలేమీ లేదని నటి గౌతమి వ్యాఖ్యానించారు. గతంలో కొంతకాలం సహజీవనం చేసినంత మాత్రాన రాజకీయాల్లో కలసి నడుస్తామని భావించనక్కర్లేదని, కమల్ లేదా రజనీకాంత్ లు సొంత పార్టీలను పెట్టుకుంటే, అవి వారి సొంత నిర్ణయాలుగానే భావిస్తానని చెప్పారు. ఎవరైతే ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి పోరాడతారో, వారికే తన మద్దతు ఉంటుందని అన్నారు.

అది ఎవరైనా కావచ్చని, ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక తనకు లేదని చెప్పారు. ఇక జయలలిత మరణంపై నియమించబడిన కమిషన్ పారదర్శకంగా పని చేయాలని తాను కోరుతున్నట్టు గౌతమి తెలిపారు. అమ్మ మరణంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తీర్చేలా విచారణ ఉండాలన్నదే తన అభిమతమని అన్నారు. ఎవరి ప్రలోభాలకూ లోనవకుండా విచారణ వేగంగా జరపాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News