sailaja kiran: తన భర్త, కుమార్తెల గురించి శైలజా కిరణ్ స్పందన!

  • నా భర్త వ్యక్తిత్వం చాలా గొప్పది
  • ప్రతి ఒక్కరిని 'మీరు' అనే సంబోధిస్తారు
  • మీకు లక్ష్మి, సరస్వతి, పార్వతిలు పుట్టారని అందరూ అంటుంటారు
  • సుమన్ మరణం బాధాకరం

తన భర్త కిరణ్ వ్యక్తిత్వం చాలా గొప్పదని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. ఎవరినైనా 'సర్' అనే సంబోధిస్తారని, అందరితోను 'మీరు' అంటూ ఎంతో మర్యాదగా మాట్లాడతారని చెప్పారు. తనకు ముగ్గురు కుమార్తెలని... అందుకే అంతా 'మీకు లక్షి, సరస్వతి, పార్వతిలు పుట్టారని' అంటుంటారని తెలిపారు. రెండో అమ్మాయి అచ్చం తనలాగానే ఉంటుందని అంటుంటారని, పెద్దమ్మాయి తన అత్తగారిలా ఉంటుందని, చిన్నమ్మాయి ఆమె తాతగారిలా ఉంటుందని తనకు అనిపిస్తుంటుందని చెప్పారు. ముగ్గురూ కూడా చాలా ఇంటెలిజెంట్స్ అని, చాలా డిసిప్లిన్డ్ గా ఉంటారని అన్నారు. ముగ్గురూ మంచి డ్యాన్సర్లని, సంగీతం కూడా నేర్చుకుంటున్నారని చెప్పారు. వారు ముగ్గురూ కలసి పాడితే వినాలనేది తన కోరికని, తన కోరికను వారు తీరుస్తారా? లేదా? అనేది వేచి చూడాలని చెప్పారు. వారి తాతనే వారికి మర్గదర్శి అని తెలిపారు.

తన మరిది సుమన్ చనిపోవడం తమకు ఎంతో బాధను కలిగించిందని చెప్పారు. ఆయన మరణంతో తమ కుటుంబంలో ఒక విధమైన నిశ్శబ్ద వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమన్ చాలా మంచి వ్యక్తి అని... పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు వారితో ఆడుతూ, పాలు కూడా పట్టేవారని గుర్తు చేసుకున్నారు.

ఆరోగ్యానికి తాను చాలా ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. గత ఐదేళ్లుగా మంచి డైట్ పాటిస్తున్నానని, పోషకాహారాలు, కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటున్నానని తెలిపారు. గత పదేళ్ల నుంచి వర్కౌట్లను కూడా రెగ్యులర్ గా చేస్తున్నానని చెప్పారు. 

  • Loading...

More Telugu News