pawan kalyan: టీడీపీతో దాదాపుగా తెగదెంపులే... ఒక్క ట్వీట్ తో పవన్ కల్యాణ్ చెప్పేశారంటున్న విశ్లేషకులు!

  • ఈ ఉదయం మంత్రుల పేర్లు ప్రస్తావిస్తూ ట్వీట్ పెట్టిన పవన్
  • ఎంతో ఆగ్రహంతోనే ఇలాంటి ట్వీట్ పెట్టారంటున్న రాజకీయ నిపుణులు
  • తన వ్యాఖ్యలతో మనసులోని మాట బయటపెట్టారని అంచనా
  • పవన్ తాజా ట్వీట్ పై ఇంకా స్పందించని టీడీపీ నేతలు

జనసేనాని పవన్ కల్యాణ్ ఈ ఉదయం పెట్టిన ఓ ట్వీట్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎజెండా, జెండాలేని పవన్ గురించి ఆలోచించే తీరిక, సమయం తనకు లేవని మంత్రి పితాని చేసిన వ్యాఖ్యలను, గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ, వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ పెట్టిన ట్వీట్ ను విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు, టీడీపీతో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తరువాతనే ఆయనిలాంటి ట్వీట్ చేసుంటారని అంచనా వేస్తున్నారు.

 ఒక్క ట్వీట్ తో ఆయన తన వైఖరిని స్పష్టం చేశారని, తన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారంటూ హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసుంటారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రచారానికి తనను వాడుకుని, ఇప్పుడు తానెవరో తెలియదంటూ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఎంత ఆగ్రహంగా ఉండకపోతే, పేర్లను ప్రస్తావిస్తూ మరీ పవన్ వ్యంగ్యాస్త్రాన్ని వదులుతూ కామెంట్ చేసుంటాడని విశ్లేషిస్తున్నారు. స్వయంగా మంత్రులు పవన్ గురించి చేస్తున్న కామెంట్లు ఆయనకు కాస్తంత గట్టిగానే తగిలాయని, అందుకే ఆయనలా స్పందించాడని చెబుతున్నారు. ఇక పవన్ తాజా ట్వీట్ పై తెలుగుదేశం నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More Telugu News