siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపుతున్న నవ దంపతుల హత్య!

  • తల్లిదండ్రులు మరణించడంతో మేనమామల పంచన చేరిన రచన
  • ఇంటికి దగ్గర్లో ఉండే హరీష్ తో ప్రేమ
  • మేనమామలు తెచ్చిన సంబంధం కాదని, ప్రియుడితో వివాహం
  • కక్షగట్టిన మేనమామలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవదంపతుల హత్య కలకలం రేపుతోంది. వేములవాడ మండలం బాలరాజ్‌ పల్లిలో నేదూరి హరీశ్‌ (24), రచన (22) దంపతులను రచన మేనమామలు గొంత కోసి హతమార్చారు. చందుర్తి మండలం రామన్నపేటకు చెందిన దమ్ము లక్ష్మణ్, విజయలక్ష్మి దంపతుల కుమార్తె రచన తల్లిదండ్రులు మరణించడంతో బాలరాజ్ పల్లిలోని మేనమామలు శేఖర్, అశోక్, నాగరాజుల పంచన చేరింది. దీంతో ఆమె బాధ్యతను మేనమామలు తీసుకున్నారు. ఈ క్రమంలో వారింటికి దగ్గర్లో ఉన్న హరీష్ తో రచన ప్రేమలో పడింది.

వీరి విషయం తెలిసిన ఆమె మేనమామలు ఒక సంబంధం తెచ్చారు. అది ఇష్టం లేని రచన హరీష్ తో వెళ్లిపోయి వివాహం చేసుకుంది. అప్పటి నుంచి రగిలిపోయిన రచన మేనమామలు సరైన అదునుకోసం చూశారు. నిన్న సాయంత్రం ఒంటరిగా ఉన్న సమయం చూసి, హరీష్ ఇంట్లోకి చొరబడి వారిద్దరి గొంతుకోసి హతమార్చారు. అనంతరం పరారయ్యారు.

దీంతో హరీష్ పై ఆధారపడి బతుకుతున్న అతని తల్లిదండ్రులు ఘొల్లుమంటున్నారు. మరోపక్క, తనకు ప్రాణహాని ఉందని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవాలని హరీష్ మేనమామ పోలీసులను కోరుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

More Telugu News