balakrishna: పదే పదే సహనం కోల్పోతున్న బాలకృష్ణ... తెలుగుదేశం నేతల్లో అసంతృప్తి!

  • పలుమార్లు అభిమానులపై చెయ్యి చేసుకుని వార్తల్లో నిలిచిన బాలయ్య
  • బాలయ్య వైఖరితో టీడీపీపై దుష్ప్రభావం
  • బహిరంగంగా చెప్పకుండా సహచరుల వద్ద చర్చిస్తున్న మంత్రులు
  • చంద్రబాబే కల్పించుకోవాలని అంటున్న పార్టీ సీనియర్లు

తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు వరుసగా జరుగుతూ ఉండటం, ఆయా ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, వీటిని ఎలా సమర్థించుకోవాలో తెలియడం లేదని స్వయంగా ఆ పార్టీ సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా చేయవద్దని ఆయనకు చెప్పలేకపోతున్నామని, ఇక చంద్రబాబే బాలయ్యతో మాట్లాడాలని పార్టీ సీనియర్ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు.

తాజాగా, అనంతపురం జిల్లాలో జరిగిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న వేళ, ఓ అభిమాని, టీడీపీ కార్యకర్తను బాలకృష్ణ కొట్టినట్టు కనిపిస్తున్న వీడియో వైరల్ అయింది. పంచ్ డైలాగులు, ఫైట్స్ తో సినిమాల్లో తన అభిమానులను అలరించే బాలకృష్ణ, ఇలా తనపై అభిమానం చూపే వారిమీద సంయమనం కోల్పోయి చెయ్యి చేసుకోవడం పార్టీపై చెడు ప్రభావాన్ని చూపిస్తోందని వ్యాఖ్యానిస్తున్న వారి సంఖ్య టీడీపీలో క్రమంగా పెరుగుతోంది. పూలదండ వేయాలని వచ్చిన వారిని, సెల్ఫీ దిగాలని భావించిన వారిని కొట్టడం మంచిది కాదని సూచిస్తున్నారు.

హిందూపురం ఎమ్మెల్యేగా, ప్రజల మంచి చెడులు చూస్తూ, సమస్యలు పరిష్కరించడంలో మంచి పేరు తెచ్చుకున్న బాలకృష్ణ, ఇలా సంయమనం కోల్పోతూ వార్తల్లోకి ఎక్కడం మంచిది కాదని సూచిస్తున్నారు. అయితే, టీడీపీ నేతలెవరూ బహిరంగంగా బాలయ్యకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయడం లేదు. ఇదే సమయంలో తమ సన్నిహితులు, ఇతర నేతల వద్ద మాత్రం బాలయ్య అసహనంపై చర్చలు పెడుతున్నట్టు సమాచారం.

More Telugu News