paritala sriram: అమరావతికి వస్తాను, మాట్లాడుకుందాం: చంద్రబాబుతో కేసీఆర్

  • సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గం
  • అపరిష్కృత సమస్యలను పరిష్కరిద్దాం
  • కేసీఆర్ సూచనకు చంద్రబాబు ఓకే
  • త్వరలోనే అమరావతి పర్యటన

తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యల పరిష్కారం దిశగా చర్చలు సాగించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు తాను అతి త్వరలోనే అమరావతికి వస్తానని, ఆ సమయంలో సమస్యలపై చర్చిద్దామని చంద్రబాబుతో అన్నారు. నిన్న అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరిగిన పరిటాల శ్రీరామ్ వివాహ వేడుక సందర్భంగా రెండు రాష్ట్రాల సీఎంలు ఒకరికి ఒకరు తారసపడ్డారు. ఆ సమయంలో వీరిద్దరూ కలిసింది రెండు నిమిషాల పాటే అయినా, తాను త్వరలోనే అమరావతికి వస్తానని కేసీఆర్ చెప్పగా, చంద్రబాబు తప్పకుండా రావాలని కోరారు.

కాగా, విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మకు కేసీఆర్ మొక్కులు చెల్లించుకోవాల్సి వుందన్న సంగతి తెలిసిందే. గత నెల 27నే కేసీఆర్ విజయవాడ పర్యటనకు వెళ్లాల్సి వుండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. త్వరలోనే విజయవాడ పర్యటనకు ముహూర్తం నిర్ణయించుకుని దుర్గమ్మకు తాను మొక్కుకున్న ముక్కుపుడకను కానుకగా ఇచ్చి, అనంతరం అమరావతిలో పర్యటించి అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News