space x: 2024లో అంగార‌కుడిపై నివాసం... సాధ్యం చేస్తామంటున్న స్పేస్ ఎక్స్‌

  • ప్ర‌ణాళిక‌ సిద్ధం చేసిన ఇలాన్ మ‌స్క్‌
  • 2022లో మొద‌టి కార్గో ప్ర‌యాణం
  • నివాసాల డిజైన్‌ను పోస్ట్ చేసిన స్పేస్ ఎక్స్‌

వ‌చ్చే ఐదేళ్ల‌లో అంగారక గ్ర‌హాన్ని నివాస‌యోగ్యంగా మార్చి, అక్క‌డికి రెండు కార్గో ప్ర‌యాణాల ద్వారా మ‌నుషులను చేర‌వేస్తామ‌ని స్పేస్ ఎక్స్ సంస్థ సీఈఓ ఇలాన్ మ‌స్క్ ప్ర‌క‌టించారు. ఆస్ట్రేలియాలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఆస్ట్రానాటిక‌ల్ కాంగ్రెస్ (ఐఏసీ)లో ఆయ‌న ప్ర‌సంగించారు.

 ప్ర‌స్తుతం స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేస్తున్న బీఎఫ్ఆర్ రాకెట్ గురించి ఆయ‌న వివ‌రించారు. దీని సాయంతో అంగార‌క గ్ర‌హం మీద‌కి మ‌నుషుల‌ను చేర‌వేయ‌డంతో పాటు, భూమ్మీద ఏ ప్రాంతానికైనా ఒక గంటలోపే చేరుకోవ‌చ్చ‌ని మ‌స్క్ తెలిపారు. అంగార‌క గ్ర‌హం మీద నీటి ల‌భ్య‌త, అక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేశాక 2022లో మొద‌టి కార్గో మిష‌న్ ద్వారా మ‌నుషుల‌ను చేర‌వేస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

అక్క‌డ భ‌వ‌న స‌ముదాయాల‌ను, జీవ‌నానికి కావాల్సిన ఇత‌ర సౌక‌ర్యాల‌ను స్పేస్ ఎక్స్ అందుబాటులోకి తీసుకువ‌స్తుంద‌ని అన్నారు. 2024 క‌ల్లా అంగార‌క గ్ర‌హాన్ని పూర్తి స్థాయి నివాస యోగ్యంగా మార్చే ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ విష‌యానికి సంబంధించిన ఊహాచిత్రాలతో కూడిన డిజైన్‌ను స్పేస్ ఎక్స్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది.

More Telugu News