Myanmar: మయన్మార్‌లో రోహింగ్యాల అరాచకాలు.. గుట్టలుగా బయటపడుతున్న హిందువుల మృతదేహాలు!

  • రోహింగ్యా తీవ్రవాదుల అరాచకాలు వెలుగులోకి
  • విస్తుపోతున్న ప్రపంచం
  • హిందువులను వరుసగా నిలబెట్టి గొంతు కోసి పూడ్చిపెట్టిన వైనం


మయన్మార్‌లో హిందువులపై జరిగిన దారుణాలను చూసి ప్రపంచం విస్తుపోతోంది. రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తున్న ఊతకోత ఘటనలు ప్రతి ఒక్కరినీ కన్నీరు  పెట్టిస్తున్నాయి. హిందువులను ఊచకోత కోసి గోతుల్లో పూడ్చిపెట్టిన మృతదేహాలను మయన్మార్ సైన్యం వారం రోజులుగా వెలికి తీస్తోంది. తమవారిని విగతజీవులుగా చూస్తున్న కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. వారిని ఊరడించడం ఎవరి తరమూ కావడం లేదు. ఇటీవల ఉత్తర రఖైన్‌లోని ఖామౌంగ్ షేక్ అనే గ్రామంలో 45 మంది హిందువుల మృతదేహాలను వెలికి తీసిన సైన్యం అదృశ్యమైన మరో 55 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

 గత నెల 25న ఆర్కాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అనే ముస్లిం తీవ్రవాద సంస్థ పిల్ల, పెద్ద, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా హిందువులను గుంపులుగా నిలబెట్టి గొంతు కోసి హత్య చేసింది. అనంతరం అందరినీ ఒకేచోట పూడ్చిపెట్టారు. ‘జాతి శుద్ధి’ పేరుతో రెండు నెలల క్రితం సైనిక చర్య మొదలైన తర్వాత తొలిసారి సైన్యం మీడియాను వెంటపెట్టుకుని ఊచకోత జరిగిన ప్రాంతాలకు తీసుకెళ్లి వారి అరాచకాలను చూపించింది.

మౌంగ్ షేక్ గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీరు కట్టలు తెంచుకుంటోంది. ముసుగులు ధరించిన కొందరు దుండగులు తమపై దాడిచేసి తమ కళ్లముందే తమవారిని చంపేశారని చెబుతున్నారు. తన కళ్ల ముందే భర్త, ఇద్దరు సోదరులు, గ్రామస్థులను చంపేశారని గ్రామానికి చెందిన రీకాధర్ కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. తన భర్తతోపాటు వందమందిని కొండల్లోకి తీసుకెళ్లి చంపేశారని మరో మహిళ ప్రమీల తెలిపింది.

మరోపక్క, గత ఏడాది కాలంగా ముస్లిం తీవ్రవాదుల చేతుల్లో 163 మంది చనిపోగా, 91 మంది గల్లంతయ్యారని మయన్మార్ సైన్యం తెలిపింది. కాగా, ఆత్మీయులను కోల్పోయిన 5 లక్షల మందికి పైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చారు. మరోవైపు శ్రీలంకలోని రోహింగ్యాలపై బౌద్ధులు దాడులకు దిగుతున్నారు. కొలంబోలో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న శిబిరం వద్ద బౌద్ధులు ఆందోళనకు దిగారు.

More Telugu News