Mathura: రావణుడి ప్రతిమను దహనం చేయడం వారిని అవమానించడమే.. తక్షణం ఆపించండి: యూపీ లాయర్ వినతి

  • రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాసిన మధుర లాయర్
  • రావణుడిని పూజిస్తున్న వారిని అవమానించొద్దని వేడుకోలు
  • రావణుడు సారస్వత్ బ్రాహ్మిణ్

దసరా సందర్భంగా రావణుడి ప్రతిమను దహనం చేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన ఓ లాయర్ ఓంవీర్ సరస్వత్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీకి లేఖలు రాశారు.

ఓంవీర్ సారస్వత్ కథనం ప్రకారం.. రావణుడు లంకాధిపతి. ఆయన సారస్వత్ బ్రాహ్మిణ్. విజయదశమి నాడు రావణ దహనం చేయడం వల్ల ఆ సామాజిక వర్గాన్ని అవమానించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయనను పూజించే వారిని కించపరచడమే అవుతుందని రాష్ట్రపతి, ప్రధానితోపాటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

రావణుడిని ఇతర సామాజిక వర్గాలు కూడా పూజిస్తాయని, మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో పెద్ద విగ్రహం ఉందని, గ్రేటర్ నోయిడాలోని బిస్రాఖ్‌లో రావణుడి గుడి ఉందని ఆయన వివరించారు. తాము (సారస్వత్ బ్రాహ్మణులు) కూడా ఈ దేశ పౌరులమేనని, కాబట్టి రావణ దహనాలు నిర్వహించి తమ మనోభావాలను కించపరచకుండా చూడాలని అభ్యర్థించారు. అంతేకాక రావణ దహనం సందర్భంగా చాలాసార్లు తొక్కిసలాటలు జరిగి ఎంతోమంది మరణించారని, వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రావణ దహనాలను అడ్డుకోవాలని ఆయన కోరారు.

More Telugu News