దేవ‌సేన: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌ర్ దేవ‌సేన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వీడియో వైరల్!

  • టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు
  • జనగాంలోని మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణంలో అక్రమాలు
  • టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపణ

జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌ర్ దేవ‌సేనకు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. స‌ద‌రు ఎమ్మెల్యే అక్రమాలను ఇంత కాలం ఓపిక పట్టానని ఆమె అన్నారు. ఇకపై ఏమాత్రం సహించబోన‌ని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ గా మారింది.

 జనగాంలోని మినీ ట్యాంక్‌బండ్‌ (బతుకమ్మ కుంట) నిర్మాణంలో చాలా అక్రమాలు జరిగాయన్నారు. బతుకమ్మ కుంట అభివృద్ధి పనులు అధికారుల ప్రమేయం లేకుండా జరిగాయని తేల్చి చెప్పారు. నిర్మాణ పనుల్లో రూ.30 లక్షలు దుర్వినియోగం అయ్యాయని అన్నారు. అర ఎకరం భూమిని సదరు ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె ఆరోపించారు.

కుంటకు వాల్ కట్టేటపుడు ఎవరి పర్మిషన్ తీసుకోలేదని, పని పూర్తయిన తర్వాత ఎస్‌ఈతో ఇన్‌స్పెక్షన్‌ చేయించి నోట్ పెట్టారని అన్నారు. గ‌తంలో స‌ద‌రు ఎమ్మెల్యే ఓ గుడిని కూడా తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని చెప్పిన దేవ‌సేన‌.. దాన్ని తానే రద్దు చేశానని అన్నారు. బతుకమ్మ కుంట ప్రదేశం వివాదాస్పద స్థలంగా ఉండటంతోనే అక్కడ వేడుకలు నిర్వహించట్లేదని కలెక్టర్ దేవసేన చెప్పారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని, త‌న వ‌ద్ద సాక్ష్యాలు ఉన్నాయ‌ని అంటూ ఆమె చేస్తోన్న వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

More Telugu News