Tamilnadu: నకిలీ స్వామీజీ లీల.. సంతానం కోసం సంప్రదిస్తే... భార్యతో జంప్!

  • తమిళనాడులోని తంజావూరు జిల్లాలో నకిలీ స్వామీజీ  
  • పూజలు, యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ పేరు ప్రతిష్ఠలు 
  • సంతానం కలగలేదని ఆశ్రయించిన దంపతులు
  • పూజల పేరుతో భక్తుడి భార్యతో పరారైన స్వామీజీ

దేశంలో దొంగస్వాముల లీలలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక దొంగ స్వామీజీ చేసిన నిర్వాకం అందర్నీ ఔరా అని ముక్కున వేలేసేలా చేసింది. దాని వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులోని తంజావూరు జిల్లా ఆరూరులో బాలమురుగన్ అనే స్వామీజీ మూడేళ్లుగా ఉంటున్నాడు. అక్కడ పూజలు, యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ మంచి పేరుతెచ్చుకున్నాడు. దీంతో పళ్లియాకారైకి చెందిన విజయ్ కుమార్, పునీత దంపతులు వివాహమై పదేళ్లైనా తమకు సంతాన భాగ్యం కలుగలేదని స్వామీజీని ఆశ్రయించారు. దీంతో ప్రత్యేక పూజలు చేయాలని చెప్పిన బాలమురుగన్ అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు.

ఈ క్రమంలో ఈనెల 21న స్వామీజీ మఠానికి వెళ్లిన పునీత తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో విజయ్ కుమార్ మఠానికి వెళ్లిన తన భార్య కనిపించడం లేదని, అదే రోజు నుంచి బాలమురుగన్ కూడా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, నకిలీ స్వామీజీ గతంలో బెంగళూరులోని సాఫ్ట్ వేర్ రంగంలో పని చేశాడని, అక్కడే ఒక యువతిని వివాహం కూడా చేసుకున్నాడని గుర్తించారు. కుటుంబానికి చెప్పకుండా పారిపోయి స్వామీజీ అవతారమెత్తాడని, పునీతతో పరారయ్యాడని గుర్తించారు. 

More Telugu News