Falahari Maharaj: తేనెతో నా నాలుకపై బీజాక్షరం రాస్తా.. దానిని నాకితే నీకు జ్ఞానం వస్తుంది..!: 'లా' విద్యార్ధినిపై అత్యాచారానికి ముందు బాబా అన్న మాటలివి!

  • ఎంతోమందిని ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలను చేశానన్న బాబా
  • బాధితురాలిని ఏకంగా జడ్జినే చేస్తానని వరం
  • అందుకు ప్రతిగా ఏమిస్తావని అడిగి అత్యాచారం

‘‘నా నాలుకపై తేనెతో ఓం అనే బీజాక్షరం రాస్తా.. నువ్వు దానిని నాకితే నాలోని జ్ఞానం నీకు ప్రసారమవుతుంది. చాలామందికి ఇలానే నాలోని జ్ఞానాన్ని ప్రసాదించాను’’ అని ఫలహారీ బాబా తనతో చెప్పినట్టు బాబా చేతిలో లైంగిక దాడికి గురైన చత్తీస్‌గఢ్‌కు చెందిన 21 ఏళ్ల లా విద్యార్థిని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఆయన అనుగ్రహం పొందాలంటే నాలుకను నాకాల్సిందేనని పట్టుబట్టాడని తెలిపింది.

ఆ రోజు సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో బాబా తనను గదిలోకి పిలిచారని, తాను వెళ్లగానే శిష్యులను బయటకు పంపించి వేసి, తలుపులు మూసేశారని బాధితురాలు పేర్కొంది. అనంతరం తనను గట్టిగా పట్టుకున్నారని, దీంతో తాను ఏమీ చేయలేక అచేతనంగా ఉండిపోయానని తెలిపింది. భగవంతుడి ఆదేశాల ప్రకారమే ఇదంతా జరుగుతోందంటూ బలవంతం చేశారని వివరించింది.

తనపై లైంగికదాడికి పాల్పడిన సమయంలో బయట నుంచి ఎవరో తలుపు కొట్టడంతో హడావిడిగా దుస్తులు ధరించారని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడని బాబా తనను బెదిరించినట్టు బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాతి రోజు బాబా అనుచరులు తనను రైల్వే స్టేషన్‌లో వదిలిపెట్టి వెళ్లిపోయారని తెలిపింది.

తనకు జరిగిన ఘోరాన్ని కొన్ని రోజులపాటు ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయానని, చివరికి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో శనివారం కౌసలేంద్ర ప్రపన్నాచార్య అలియాస్ ఫలహారీ బాబా (60)ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. ఆగస్టు 7న ఆశ్రమానికి వెళ్లిన బాధితురాలు అదే రోజు తిరిగి వచ్చేయాలని అనుకుంది.

అయితే ఆ రాత్రి అక్కడే ఉండమని చెప్పిన బాబా ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తాను ఎంతోమందిని ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలను చేశానని, తనను ఏకంగా జడ్జినే చేస్తానని పేర్కొన్నాడని బాధిత యువతి పేర్కొంది. అందుకు ఏమిస్తావని అడిగి తనను మంచంపై పడదోసి దేవుడు ఆదేశాల మేరకు అంటూ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వివరించింది.
 
 
 

More Telugu News