Adventure: నోట్ల రద్దు ఓ విఫలయత్నం.. అక్కడ తప్ప ఎక్కడా విజయవంతం కాలేదు: మన్మోహన్ సింగ్

  • మరోమారు సునిశిత విమర్శ చేసిన మాజీ ప్రధాని
  • నాగరిక ప్రపంచంలో నోట్ల రద్దు విజయవంతం కాలేదని వ్యాఖ్య
  • దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయన్న మన్మోహన్

గతేడాది నవంబరులో కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోమారు తప్పుబట్టారు. దీనిని నిరర్థక సాహసంగా అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమంలోకి వెళ్లిపోయిందన్నారు. మొహాలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దుపై మరోమారు సునిశిత విమర్శలు చేశారు. ఆర్థికంగా, సాంకేతికంగా.. ఏ విధంగా చూసినా ఈ ‘సాహసం’ వల్ల ఉపయోగం లేకుండా పోయిందన్నారు. లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాల్లో తప్ప ఏ నాగరిక ప్రపంచంలోనూ నోట్ల రద్దు విజయవంతం కాలేదని మన్మోహన్ పేర్కొన్నారు.

నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనా? అన్న ప్రశ్నకు మన్మోహన్ బదులిస్తూ.. తానైతే అలా అనుకోవడం లేదన్నారు. చలామణిలో ఉన్న 86 శాతం నగదును ఉపసంహరించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగిందన్నారు. నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ల వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందని, అయితే తాత్కాలికంగా మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. వాటిని అధిగమించాల్సి ఉంటుందన్నారు. దేశానికి రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థిక వేత్త కూడా. 1990లలో దేశంలో సంస్కరణలకు బీజం వేశారు. అందుకే ఆయనను ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ రీఫామ్స్’గా అభివర్ణిస్తారు.

More Telugu News