ndtv: లేదు.. ఆ వార్తలు అబద్ధం.. ఎన్డీటీవీ విక్రయ వార్తలను ఖండించిన యాజమాన్యం

  • అందులో ఒక్క లైన్ కూడా నిజం కాదు
  • స్పష్టం చేసిన సీనియర్ అధికారులు
  • బీఎస్‌ఈకి నోట్ పంపిన యాజమాన్యం

ప్రముఖ జాతీయ న్యూస్ చానల్ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్‌డీటీవీ)ని స్పైస్‌జెట్ సొంతం చేసుకోనున్నట్టు వస్తున్న వార్తలను ఎన్‌డీటీవీ యాజమాన్యం ఖండించింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. ఈ మేరకు బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజ్ (బీఎస్‌ఈ)కి ఓ నోట్ కూడా  పంపింది. ఆ వార్తలను పట్టించుకోవాల్సిన పనిలేదని అందులో స్పష్టం చేసింది. హల్‌చల్ చేస్తున్న వార్తల్లో ఒక్క ముక్క కూడా నిజం కాదని ఎన్‌డీటీవీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

1988లో ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ప్రారంభించిన ఎన్‌డీటీవీ త్వరలో చేతులు మారబోతోందంటూ వార్తలు వచ్చాయి. స్పైస్‌జెట్ అధినేత అజయ్ సింగ్ దీనిని కొనుగోలు చేయనున్నట్టు వచ్చిన వార్తలు మార్కెట్లో సంచలనం సృష్టించాయి. ఈ వార్తలతో ఎన్‌డీటీవీ షేరు ఒక్కసారిగా 5 శాతం లాభపడింది. డీల్ తర్వాత అజయ్ సింగ్‌కు 40 శాతం, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లకు 20 శాతం ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్‌డీటీవీకి కష్టాలు మొదలైనట్టు చెబుతున్నారు. జూన్ 5న ప్రణయ్ రాయ్ నివాసాలపై సీబీఐ దాడులు చేసింది. మరోవైపు ఎన్‌డీటీవీ గత దశాబ్ద కాలంగా లాభాలు చూసింది లేదు. రూ.1,474 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విక్రయానికే మొగ్గు చూపినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు సంస్థను కొనుగోలు చేయాలని భావిస్తున్న అజయ్ సింగ్ బీజేపీకి చాలా సన్నిహితుడు కావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అంతేకాదు ప్రధాని మోదీ అంతరంగికుల్లో ఒకరు కూడా. ఈ నేపథ్యంలో ఎన్‌డీటీవీ విక్రయ వార్తలు మార్కెట్లో పెను సంచలనం కలిగించాయి.
 
 
 

More Telugu News