dubai: దుబాయ్ లో తెలుగు యువకుడిని హత్య చేసిన మరో తెలుగోడు!

  • కొండంత ఆశతో దుబాయ్ వెళ్లిన యువకుడు
  • రెండు నెలల క్రితం మరో తెలుగు వ్యక్తితో గొడవ
  • కత్తితో పొడిచి హత్య చేసిన దుండగుడు
  • దర్యాప్తు చేస్తున్న దుబాయ్ పోలీసులు

కుటుంబ కష్టాలు తీరుతాయనే కొండంత ఆశతో అప్పూసొప్పూ చేసి ఉపాధి కోసం దుబాయ్ కి వెళ్లిన ఓ తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం సోమన్ పల్లి గ్రామానికి చెందిన చంద రవి (28) రెండేళ్ల క్రితం దుబాయ్ కు వెళ్లాడు. అక్కడ ఓ అపార్ట్ మెంట్ లో ఉంటూ, కూలి చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇంటికి డబ్బులు పంపుతూ ఉండేవాడు.

రెండు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా భీంగల్ కు చెందిన ఓ యువకుడితో రవికి దుబాయ్ లోనే గొడవ జరిగింది. అయితే, ఈ విషయాన్ని రవి పెద్దగా పట్టించుకోలేదు. అయితే అవతలి వ్యక్తి మాత్రం దీన్ని మర్చిపోలేదు. నిన్న ఉదయం రవి ఉంటున్న అపార్ట్ మెంట్ కు వచ్చి అతనిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

రవి కేకలు విన్న అతని స్నేహితులు పరుగెత్తుకుంటూ వచ్చారు. కానీ ఈలోగానే రవి మరణించాడు. అప్పటికే హత్య చేసిన యువకుడు పారిపోయాడు. ఈ హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు, రవి మృతి వార్త విన్న అతని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరి కొన్ని నెలల్లో ఇంటికి వస్తాడనుకున్న భర్త చనిపోయాడన్న వార్తతో అతని భార్య షాక్ కు గురైంది. రవికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

More Telugu News