dawood ibrahim: తన చివరి రోజులను భారత్ లో గడపాలని దావూద్ అనుకుంటున్నాడు.. బీజేపీ నేతలతో టచ్ లో వున్నాడు!: రాజ్ థాకరే

  • దావూద్ ఆరోగ్యం బాగోలేదు
  • భారత్ కు రావాలనుకుంటున్నాడు
  • బీజేపీ అగ్రనేతలతో మాట్లాడుతున్నాడు
  • అయితే క్రెడిట్ కొట్టేసేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు
  • దావూద్ ను రప్పించడానికి మోదీ చేసిందేమీ లేదు

పాకిస్థాన్ లో ఉన్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం బాగోలేదని నివేదికలు చెబుతున్నాయని... తన చివరి రోజులను స్వదేశమైన భారత్ లో గడపాలని దావూద్ ఆకాంక్షిస్తున్నాడని మహారాష్ట్ర నవ నిర్మాణసేన అధినేత రాజ్ థాకరే అన్నారు. భారత్ రావాలనుకోవడం దావూద్ సొంతంగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. తిరిగి వచ్చేందుకు ఆయన బీజేపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారని తెలిపారు.

అయితే, ఒకవేళ దావూద్ భారత్ కు తిరిగి వచ్చినట్లైతే ఆ క్రెడిట్ కొట్టేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేని పనిని, తాము చేశామని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటారని అన్నారు. వాస్తవానికి దావూద్ విషయంలో మోదీ ప్రభుత్వం పాకిస్థాన్ పై ఎలాంటి వత్తిడి తీసుకురాలేదని చెప్పారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు చాలా తెలివిగా...  అంతర్జాతీయ సంబంధాలను మోదీ తెరపైకి తీసుకొస్తున్నారని రాజ్ థాకరే విమర్శించారు. జపాన్ ప్రధాని అబేకు దేశ రాజధాని ఢిల్లీలో కాకుండా, అహ్మదాబాద్ లో ఆహ్వానం పలికారని చెప్పారు. జపాన్ ప్రధానిని కూడా ఎన్నికల ప్రచారంలో ఒక పావుగా వాడుకోవడం బీజేపీకే చెల్లిందని అన్నారు. 

More Telugu News