delhi: కాబోయే భర్తను ఇరికించబోయి తానే బుక్కయిన యువతి!

  • పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో కలసి దొంగతనం నాటకం
  • రూ. 20 లక్షలు దోచుకెళ్లారని ఫిర్యాదు
  • పోలీసుల విచారణతో విషయం వెలుగులోకి

పెద్దలు తనకు నచ్చని పెళ్లి చేస్తున్నారన్న కోపంతో పెళ్లి కుమారుడిని ఇరికించాలని తన ప్రియుడితో కలసి ప్లాన్ చేసిన యువతి అడ్డంగా దొరికిపోయిన ఘటన న్యూఢిల్లీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈశాన్య ఢిల్లీ సీలంపూర్ కు చెందిన షబానాకు త్వరలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల్లో కుటుంబమంతా నిమగ్నమై ఉన్న వేళ, ఆమె ఇంట్లో దొంగతనం జరిగిందని, ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు లోనికి చొరబడి, తనను బెదిరించారని, రూ. 20 లక్షల నగదు, నగలు దోచుకుపోయారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిందితుల ఆనవాళ్లు చెప్పడంలో ఆమె విఫలమై తడబడటంతో అనుమానం వచ్చిన పోలీసులు, ఆమె మొబైల్ ఫోన్ డేటాను చెక్ చేశారు. దొంగతనం జరిగిన సమయంలో ఆమె ఫోన్ నుంచి ఒకే నంబరుకు చాలా కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. అది అనీష్ దనే వ్యక్తిదని, అనీష్, షబానా మధ్య ప్రేమాయణం నడుస్తోందని, పెద్దలకు తెలియకుండా వారు పెళ్లి కూడా చేసుకున్నారని తేల్చారు.

తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లికి సిద్ధమైన ఆమెను అనీష్ నిలదీయడంతో, అతనితోనే కలసి ఈ ప్లాన్ చేసిందని, తాను దోచిన సొమ్మును వరుడి ఇంట్లో పెట్టి వారిని జైలుకు పంపాలన్నది ఆమె అభిమతమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి అనీష్, షబానాలను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.

More Telugu News