Ukraine: ఉక్రెయిన్ లో ముగ్గురు తెలుగు వైద్య విద్యార్థుల మృతి!

  • బీచ్ వాలీబాల్ ఆడుతుండగా మృతి
  • సముద్రంలోకి వెళ్లిన బంతిని తెచ్చే ప్రయత్నంలో ప్రమాదం 
  • స్నేహితుడ్ని కాపాడేందుకు వెళ్లి మృతి చెందిన స్నేహితులు

ఉక్రెయిన్ లో ముగ్గురు తెలుగు వైద్య విద్యార్థులు సముద్రంలో మునిగి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ విద్యార్థులు ఉక్రెయిన్ మెడికల్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నారు. ఈ మధ్యే మూడు నెలల సెలవులకు వీరు స్వస్థలాలకు వచ్చి, తిరిగి ఉక్రెయిన్ వెళ్లారు. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి సముద్రపు ఒడ్డున బీచ్ వాలీబాల్ ఆడుతున్నారు. ఇంతలో బాల్ సముద్రంలో పడింది. దానిని తీసుకొచ్చేందుకు ముఖేష్ అనే విద్యార్థి వెళ్లి, ఇబ్బంది పడగా, అతనిని రక్షించేందుకు శశికాంత్, అశోక్ అనే ఇద్దరు తెలుగు విద్యార్థులు సముద్రంలో దూకారు.

అయితే ప్రమాదవశాత్తు వారు కూడా ఒడ్డుకు తిరిగిరాలేదని తెలుస్తోంది. దీంతో ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతిచెందారని వారి స్నేహితులు భావించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముఖేష్ హైదరాబాదుకు చెందిన వ్యక్తి కాగా, శశికాంత్ కడపకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. కాగా, సముద్రపు ఒడ్డున ఉండే అలల్లో కొంత మేర విద్యుత్ పుడుతుందని, దీని కారణంగానే ఈత వచ్చిన వారు సైతం వాటి పరిసరాల్లోకి వెళ్లినా మృత్యువాత పడే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే.

More Telugu News